తెలుగు మాట్లాడ్డమే తప్పయిపోయింది!

 

హైదరాబాద్‌లోని ఒక ఎంగిలిపీసు బళ్ళో ఒక టీచరమ్మ విద్యార్థులని బెత్తంతో చితకబాదింది. విద్యార్థులు అంటే ఒకరో ఇద్దరో కాదు.. మొత్తం 40 మంది. ఇంతకీ ఆ పిల్లలు చేసిన తప్పు ఏంటో తెలిస్తే మనం బిత్తరపోతాం. ఇంతకీ ఆ పిల్లలు చేసిన తప్పు మరేమిటో కాదు.. అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడారు అంతే. దాంతో టీచరమ్మకి కోపం వచ్చేసి పిల్లల్ని బెత్తంతో బాదేసింది. హైదరాబాద్‌లోని ఒక స్కూల్లో ఈ సంఘటన జరిగింది. టీచర్ చేతిలో దెబ్బలు తిన్న పిల్లలు లబోదిబోమంటూ తమ ఇళ్ళకి వెళ్ళి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పారు. దాంతో పిల్లల తల్లిదండ్రులు మూకుమ్మడిగా సదరు స్కూలుకి చేరుకుని పిల్లల్ని చావబాదిన టీచర్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాల ముందు ఆందోళనకు నిర్వహించారు. స్కూలు యాజమాన్యం షరా మామూలుగా సదరు టీచరమ్మ చేత ఇంగ్లీషులో ‘సారీ’ చెప్పించింది.