చీరాలలో ఉద్రిక్తత.. టీడీపీ మహిళా కార్యకర్త మృతి!
posted on Jun 25, 2019 12:52PM
ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం రుద్రమాంబపురంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. రుద్రమాంబపురంలో టీడీపీ-వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. దాడుల్లో పద్మ (28) అనే టీడీపీ మహిళా కార్యకర్తకు గాయాలయ్యాయి. దాడి ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన పద్మ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఏర్పడిన వివాదమే ఘర్షణకు కారణమని భావిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున టీడీపీ కార్యకర్త ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. దాడి ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. చీరాల డీఎస్పీ నాగరాజు, ఇంకోల్లు సీఐ రాంబాబు గ్రామానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతోంది.