టీడీపీకి ఓటేశారని ఇళ్లలోకి దూరి దాడులు.. వైసీపీ నేతలపై ఫిర్యాదు!!
posted on Jun 15, 2019 12:44PM
ఎన్నికల ఫలితాల తరువాత వైసీపీ శ్రేణులు పలువురు టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేసారని, ఈ దాడులను సహించేది లేదని టీడీపీ నేతలు చెబుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై గుంటూరు జిల్లా పిన్నెల్లి గ్రామస్తులు ఈరోజు జిల్లా గ్రామీణ ఎస్పీ జయలక్ష్మిని కలుసుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేసినందుకు వైసీపీ నేతలు తమపై కక్ష కట్టారని వాపోయారు. రాత్రిపూట తమ ఇళ్లలోకి దూరి దాడులకు దిగుతున్నారని.. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడిచేసిన వారిని అరెస్ట్ చేయకుండా తమనే ఊరి విడిచి వెళ్లిపోవాల్సిందిగా ఉచిత సలహాలు ఇస్తున్నారని వాపోయారు. తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వీరి ఫిర్యాదును స్వీకరించిన ఎస్పీ జయలక్ష్మి.. ఈ ఘటనపై విచారణ జరిపి సత్వరం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.