బీజేపీలోకి టీడీపీ ఫైర్ బ్రాండ్!!

 

టీడీపీలో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన ఆ పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ బీజేపీలో చేరడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న యామినీ శర్మ బీజేపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు సఫలీకృతం అయ్యాయని అంటున్నారు. తాజాగా ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కన్నాను కలవడంతో ఆమె కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఆదివారం నాడు గుంటూరుకు చెందిన బీజేపీ నేత శ్రీనివాస్‌ ఇంట్లో ఆమె కన్నా లక్ష్మీనారాయణతో సమావేశమై చర్చించారని తెలుస్తోంది. పార్టీలో తన రాకకు సంబంధించి కన్నాతో చర్చించడంతో పాటు పార్టీపరమైన బాధ్యతలపై కూడా ఆమె చర్చించినట్లు సమాచారం.

 

 

టీడీపీ అధికార ప్రతినిధిగా యామినీ శర్మకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. మామూలు కార్యకర్తగా పార్టీలోకి వచ్చిన ఆమె.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పైనా, ఆ పార్టీ నేతలపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేసి టీడీపీ అధిష్ఠానం దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే ఆమెకు అధికార ప్రతినిధిగా హోదా ఇచ్చారు. దాంతో మరింత విజృంభించిన యామిని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్-మల్లెపూలు ఎపిసోడ్ తో ఆమెకు ఎక్కడలేని పాపులారిటీ వచ్చింది. ఓ దశలో ఆమె పార్టీ టికెట్ ఆశించినట్టు కూడా వార్తలు వినిపించాయి. కానీ ఆమెకు టికెట్ దక్కలేదు. ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి తరువాత యామిని సైలెంట్ అయ్యారు. ఇప్పుడు కన్నా ను కలిసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మళ్ళీ ఆమె వార్తల్లో నిలిచారు. మరి యామిని బీజేపీలో చేరతారో లేదో చూడాలి.