TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్మోహనుడి చెంతచేరనున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు?

Published on: Thu May 3, 2012 9:44AM

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, అత్యంత సౌమ్యునిగా పేరుపొందిన కేంద్ర మాజీమంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. కాపు వర్గానికి చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గతంలో తెలుగుదేశం లోని ముఖ్యమైన నాయకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. పార్టీ విధివిధానాల రూపకల్పనలో కూడా ఆయన కీలకపాత్ర వహించారు. ఆయన ఎప్పుడూ పార్టీకి వీరవిధేయతతో ఉండేవారు. అటువంటి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఒక్కసారిగా చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు.

 

 

పార్టీ ప్రస్తుతం గడ్డుపరిస్థితుల్లో ఉందని, దానికి చంద్రబాబునాయుడు అనుసరించే ఒంటెద్దు పోకడలే అంటున్నారు. కాపులను, బిసిలను తెలుగుదేశం పార్టీ విస్మరించింది, గతంలో ఎన్నికల్లో ఈ వర్గాలకు సుమారు 25 టిక్కెట్లు ఇస్తే వారిలో ఐదు నుంచి ఆరుగురు లోక్ సభకు ఎన్నికయ్యేవారని, కాని ఇప్పుడు లోక్ సభలో ఒక్కరు కూడా ఆ వర్గానికి చెందినవారు లేరని ఉమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇటీవల రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశించారు. అది దక్కకపోవడంతో ఉమ్మారెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీనికి తోడు చంద్రబాబు వైఖరిలో ఇటీవల వచ్చిన మార్పులు కూడా ఆయనకు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. గుంటూరు జిల్లా పార్టీ నాయకులు ఆయనకు పార్టీ సభ్యత్వం కూడా పునరుద్దరించకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో ఆయన త్వరలో పార్టీకి గుడ్ బై చెప్పి వై.ఎస్. జగన్మోహన రెడ్డి పంచన చేరే అవకాశముంది తెలుస్తోంది.