బాబు, బొత్సకు కడప గండం
Published on: Fri Apr 6, 2012 12:14PM
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు కడప ఉప ఎన్నికలు కలవరాన్ని కలిగిస్తున్నాయి. కొద్ది నెలల క్రితం జరిగిన లోక్ సభ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి అభ్యర్థులు డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. త్వరలోనే ఈ జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో అయినా తమ వునికిని చాటుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా చులకనై పోతామని ఈ ఇద్దరు నాయకులు భయపడుతున్నట్లు తెలిసింది.
అందుకే 18 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగబోతున్నప్పటికీ ఈ మూడు నియోజకవర్గాలపైనే ఈ ఇద్దరు నాయకులు ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో ఈ ఇద్దరు నాయకులు జిల్లాలో విస్తృతంగా పర్యటించబోతున్నారు. తెలుగుదేశంపార్టీ ఈ మూడు నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది. అందువల్ల చంద్రబాబునాయుడు 10, 11 తేదీల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా తమ అభ్యర్థులను ఖరారు చేయలేడు. బొత్స తన రెండురోజుల పర్యటనలో అభ్యర్థుల ఎంపికపై ఆయా వర్గాల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించబోతున్నారు. కడప జిల్లాలో జరుగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి అభ్యర్థులకు విజయావకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ ఈసారి మరీ ఘోరంగా ఓడిపోకూదదన్న కృతనిశ్చయంతో ఈ రెండు పార్టీల నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది.


