టిడిపిలో ముదురుతున్న విభేదాలు

 

 

 

తెలుగుదేశం పార్టీలో విభేదాలు ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. విభజన విషయంలో టీడీపీలోని తెలంగాణ, సీమాంధ్ర నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్ర నేతలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీద చేస్తున్న వత్తిడి చూస్తుంటే తనకు భయం వేస్తుందని తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అనడం విశేషం. జీవోఎంకు నివేదిక ఇవ్వొద్దని చంద్రబాబుపై సీమాంధ్ర నేతలు ఒత్తిడి తెస్తుండగా, సీమాంధ్ర నేతల తీరును తెలంగాణ నేతలు తప్పుపడుతున్నారు. సీమాంధ్రకు ప్యాకేజీ ఇస్తే సరిపోతుందని, తెలంగాణ విషయంలో కేంద్ర మంత్రుల బృందానికి లేఖ ఇవ్వాల్సిందేనని వారు చంద్రబాబుతో తేల్చిచెప్పారు. అసలు కేంద్ర మంత్రుల బృందాన్నే గుర్తించడం లేదంటున్న చంద్రబాబు ఈ విషయంలో ఏం చేస్తారో వేచిచూడాలి.