మళ్ళీ చెబుతున్నా రుణమాఫీ చేస్తాం
posted on Jul 15, 2014 4:53PM
రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం పదే పదే చెబుతున్నప్పటికీ ఆర్బీఐ నుంచి రీషెడ్యూల్ కోసం హామీ దక్కలేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రుణమాఫీపై మళ్లీ ప్రకటన చేశారు. రుణమాఫీపై ఆర్బీఐ గవర్నర్ హామీ ఇచ్చారని ఆయన స్పష్టం చేశారు. రుణాల రీషెడ్యూల్ కు హామీ ఇవ్వలేదంటూ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ చేసిన ప్రకటనను ఆయన తోసిపుచ్చారు. ఈ విషయంలో ఆయనకు సమాచారం ఉండి ఉండకపోవచ్చని పుల్లారావు అబిప్రాయపడ్డారు. రెండు రోజుల్లో రిజర్వు బ్యాంకు నుంచి అధికారిక సమాచారం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయ రుణాలతో పాటు బంగారు రుణాలను కూడా మాఫీ చేస్తామని ఆయనన్నారు. రైతుల రుణమాఫీపై తాము వెనక్కి వెళ్లలేదని ఆయన చెప్పారు.