జగన్ గొప్పవారు.. రూ.21 కోట్లు సాధించడం గొప్ప విషయం: కేశినేని

 

తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా తీసుకురావడానికి కృషి చేస్తామని, కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి న్యాయం చేస్తామని ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తీరా అధికారంలోకి వచ్చాక హోదా అటక ఎక్కింది, ఇటీవల కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగినా జగన్ మౌనం వీడట్లేదంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు.. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి మొండిచెయ్యి చూపారని, ప్రత్యేక హోదా గురించిన ప్రస్తావనే లేదని టీడీపీ నేతలు కూడా విమర్శిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ లో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించకపోవడంతో టీడీపీ నేతలు జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా సెటైరికల్ కామెంట్స్ చేసారు. కేంద్రం మెడలు వంచి మరీ, కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి రూ.21 కోట్లు జగన్ సాధించడం చాలా గొప్ప విషయమంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం జగన్, ఆయన 22 మంది ఎంపీలు చాలా గొప్పవాళ్లంటూ సెటైర్లు వేశారు.