జగన్ పై దాడి.. చంద్రబాబు కొంప మునిగేది

 

వైసీపీ అధినేత వైఎస్ జగన్ గురించి, జగన్ పై జరిగిన దాడి గురించి టీడీపీ నేత, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మా వాడు జగన్‌.. పేరుకు రెడ్డే కానీ రెడ్లకుండే దాతృత్వం లేదు. జగన్‌..! ఇప్పుడు కూడా నేను నీ మేలు కోరేవాడినే. నీకు ఇద్దరు కూతుళ్లున్నారు. చక్కగా ఫ్యాక్టరీలున్నాయ్‌.. లక్షణంగా బతుకు. నేనే ఎన్నికల్లో పోటీ చేయకుండా విరమించుకోవాలనుకుంటున్నా' అని అన్నారు.

జగన్ కోడి కత్తి గాయం ఓ డ్రామా అని ఆరోపించారు. కోడికత్తితో కాకుండా పెద్ద కత్తితో జగన్ కు చిన్న గాయం చేసినా తమ చంద్రబాబు కొంప మునిగేదని వ్యాఖ్యానించారు. అక్కడ కూడా వైసీపీ వాళ్ల తెలివి పనిచేయలేదని, అంత తిక్క వ్యక్తి జగన్‌ ముఖ్యమంత్రి అయితే ఇక అంతేనని విమర్శించారు. చంద్రబాబు మరో పదే ళ్లు.. కనీసం ఐదేళ్లు సీఎంగా ఉంటేనే అనంతపురం జిల్లా సస్యశ్యామలమవుతుందని అన్నారు. 'వచ్చే ఎన్నికల్లో 30 శాతం అభ్యర్థులను మార్చకపోతే చంద్రబాబుకు అధికారం గోవిందా. ఆయన ముందుచూపున్న నాయకుడు. సీఎం కావాలనుకునే వ్యక్తి రాష్ట్ర ప్రజలంతా బాగుండాలని కోరుకుంటారు' అని అన్నారు. జగన్‌కు కామన్‌సెన్స్‌ లేదని, పట్టిసీమను చంద్రబాబు తీసుకొస్తే దాన్ని వద్దనేవాడుంటాడా అని అన్నారు. దశాబ్దాల కిందటే నిపుణులు ఈ రాష్ట్రంలో సాగునీటి సమస్య పరిష్కారానికి నదుల అనుసంధానమే మార్గమని సూచించారని, దాన్ని అమలు చేసి చూపించిన ఏకైక నాయకుడు చంద్రబాబు అని జేసీ ప్రశంసించారు.