వైసీపీలో చేరిన మరో టీడీపీ ఎమ్మెల్యే

 

ఏపీలో ఏప్రిల్ 11 న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నామినేషన్ల ఘట్టం ముగిసింది. పార్టీలన్నీ ప్రచారాలతో ఫుల్ బిజీగా ఉన్నాయి. అయినా మరోవైపు నాయకుల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కర్నూల్ జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ వైసీపీలో చేరారు. మణిగాంధీ 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన మణిగాంధీ.. రెండేళ్ల క్రితం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కుతుందని ఆయన ఆశించారు. అయితే.. కోడుమూరు టికెట్‌ను బి.రామాంజనేయులుకు చంద్రబాబు ఖరారు చేశారు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న మణిగాంధీ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వైఎస్ జగన్ కోడుమూరులో పర్యటించారు. ఈ సందర్భంగా జగన్ సమక్షంలో మణిగాంధీ మళ్లీ వైసీపీ కండువా కప్పుకున్నారు.