నెల్లూరులో ఉద్రిక్తత.. టీడీపీ నేతల ఇళ్లు కూల్చివేత!

 

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి తమ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేత, రోడ్డుకి అడ్డంగా గోడ, దాడులు, కేసులు ఇవన్నీ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా మళ్ళీ అదే రాగం ఎత్తుకున్నారు టీడీపీ నేతలు. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనార్దన్‌ కాలనీలో అక్రమ నిర్మాణాలంటూ టీడీపీ నేతలకు చెందిన మూడు ఇళ్లను కూల్చివేశారు. పోలీసు బందోబస్తు మధ్య తెల్లవారుజామున రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టారని అధికారులు చెబుతుండగా.. తాము సరైన పత్రాలతోనే స్థలం కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించామని టీడీపీ నేతలు అంటున్నారు. టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదంతా వైసీపీ సర్కారు కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.