టీడీపీకి మరో షాక్.. వైసీపీలోకి బుద్ధా వెంకన్న సోదరుడు

 

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ అధికార పార్టీ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న సోదరుడు బుద్ధా నాగేశ్వరరావు తాజాగా వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. బుద్ధా వెంకన్న మైక్ పడితే వైసీపీ మీద విరుచుకు పడుతూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఆయన సోదరుడే వైసీపీలో చేరడం.. ఇటు బుద్ధా వెంకన్నకి, అటు టీడీపీకి షాక్ అనే చెప్పాలి.

'ప్రజా సంకల్ప యాత్ర'లో భాగంగా నిన్న జగన్ శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేసారు. ఈ సందర్భంగా బుద్ధా నాగేశ్వరరావు జగన్ ని కలిసి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. జగన్ తోనే బీసీలకు న్యాయం జరుగుతుందని వైసీపీలో చేరానని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేసారు. ఇంకా చాలామంది బీసీ నేతలు వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మొత్తానికి బుద్ధా వెంకన్న లాంటి ఫైర్ బ్రాండ్ నేత సోదరుడు వైసీపీలో చేరడం టీడీపీకి ఝలక్ అనే చెప్పాలి.