నిన్న టీడీపీ తొలిజాబితాలో పేరు.. నేడు వైసీపీ వైపు చూపు

 

ఏపీ అధికార పార్టీ టీడీపీ నిన్న 126 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. అయితే ఆ జాబితాలో ఓ అభ్యర్థి టీడీపీకి షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు.. ఆదాల ప్రభాకర్‌రెడ్డి. టీడీపీ అధిష్టానం ఆయనకు నెల్లూరు రూరల్‌ టికెట్ కేటాయించింది. అయితే ఆదాల ప్రభాకర్‌రెడ్డి అనూహ్యంగా టికెట్ కేటాయించిన మర్నాడే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. టీడీపీ నేతలకు ఆయన ఫోన్ లో కూడా అందుబాటులో లేరని తెలుస్తోంది. ఆయన పార్టీ మారతారంటూ ఊహాగానాలు వస్తున్నాయి. ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తూ.. ఆదాల కార్యాలయం ముందు ఉన్న టీడీపీ ఫ్లెక్సీలను ఆయన అనుచరులు తొలగించారు. వైసీపీ ఆదాలకు ఎంపీ టికెట్‌ ఇస్తామని ఆఫర్‌ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. నెల్లూరు లోక్‌సభ నుంచి వైసీపీ తరుపున ఆదాల ఎంపీగా పోటీచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఎమ్మెల్యే అభ్యర్థి పార్టీ వీడకుండా టీడీపీ ఏమైనా బుజ్జగిస్తుందేమో చూడాలి.