కాపు నేతల రహస్య భేటీ.. టీడీపీలో సంక్షోభం!!

 

ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. కాకినాడలో ఓ హోటల్‌లో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుతో టీడీపీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు భేటీ కావడం కలకలం రేపుతోంది. ఈ సమావేశానికి హాజరైన వారిలో దాదాపు అంతా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఉన్నారు. పార్టీ మారేందుకే ఈ నేతలంతా సమావేశమయ్యారని ప్రచారం జరుగుతోంది.

కాకినాడలోని ఓ రహస్య ప్రాంతంలో జరుగుతున్న టీడీపీ మాజీల సమావేశానికి రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు బూరగడ్డ వేదవ్యాస్, బోండా ఉమ, బడేటి బుజ్జి, కదిరి బాబురావు, చెంగల్రాయుడు, మాధవనాయుడు, జ్యోతుల నెహ్రు, ఈలినాని, మీసాల గీత, వరుపుల రాజా, కేఏనాయుడు, పంచకర్ల రమేష్ బాబు తదితరులు హాజరైనట్టుగా తెలుస్తోంది. వీరంతా బీజేపీలోకి చేరేందుకు ఈ సమావేశం నిర్వహించారని రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీ తీర్ధం పుచ్చుకోవడం ఖాయమన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో దాదాపు 20 మంది వరకూ టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు కూడా సమాలోచనలు జరుపుతుండటం భవిష్యత్తులో రాజకీయ ఫిరాయింపులకు మార్దం చూపేలా కనిపిస్తోంది.

అయితే ఈ సమావేశంపై తోట త్రిమూర్తులు స్పందించారు. తాము పార్టీ మారడం లేదని, ఓటమిపై సమీక్షించుకునేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.