గవర్నర్ గో బ్యాక్.. మూడేళ్లుగా అవమానాలు.. సభలో టీడీపీ నినాదాలు..
Published on: Mon Mar 7, 2022 10:09AM
రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్.. గో బ్యాక్.. గో బ్యాక్.. అంటూ టీడీపీ నేతలు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే.. టీడీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేల నినాదాల మధ్య గవర్నర్ ప్రసంగం కొనసాగించారు.
మూడేళ్లుగా టీడీపీ సభ్యులను అవమానాలకు గురి చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. శాసనసభా గౌరవాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు మంట గలుపుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడితో పాటు కుటుంబ సభ్యులను సైతం అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్తవ్య బాధ్యతను నెరవేర్చడం కోసం టీడీపీ తరపున సభకు హాజరు అవుతున్నామని అచ్చెన్నాయుడు అన్నారు.
‘‘శాసనసభలో ఇన్ని ఇబ్బందులు, అవమానాలు ఎప్పుడూ ఎదుర్కోలేదు. 30 అంశాలను సిద్ధం చేసి సభకు వెళ్తున్నాం. సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వడం లేదు. శాసనసభను కౌరవ సభగా మార్చారు. మూడేళ్ళలో సభ సజావుగా నడిచింది లేదు. సభ గౌరవం పెంచేలా ప్రతిపక్ష పార్టీకి సభలో మాట్లాడే అవకాశం కల్పించాలి. స్పీకర్ వైసీపీ సభ్యుడిగా కాకుండా హుందాగా వ్యవహరించాలి. సభలో మైక్ ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్లం. ప్రభుత్వ ప్రకటనలకు శాసనసభా నిర్వహణపై ఆచరణలో పొంతన ఉండటం లేదు’’ అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.


