చంద్రబాబు పీఏ అరెస్ట్ 

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శిని పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు పీఏ అరెస్ట్ ఏపీలో సంచలనంగా మారింది.  ఇటీవల కుప్పం మండలం గోనుగూరులో సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  విగ్రహాల ధ్వంసం వెనుక కుట్ర ఉందని  ఆరోపించారు. 

చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ మాత్రం జ్యోతి అనే మతిస్థిమితం లేని మహిళే మద్యం మత్తులో విగ్రహాలు ధ్వంసం చేసిందని వెల్లడించారు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయవద్దంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

గోనుగూరు ఆలయంలో విగ్రహాల ధ్వంసం ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేనివాళ్లను విచారణ పేరుతో ప్రశ్నిస్తున్నారని చంద్రబాబు పీఏ మనోహర్, టీడీపీ నేతలు కుప్పంలో సీఐ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. దాంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దీనిపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి.