కాంగ్రెస్ ఖజానా ఖాళీ

అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారాన్ని చలాయించిన కాంగ్రెస్ పార్టీకి అకస్మాత్తుగా డబ్బు కొరత వచ్చి పడింది. ఎన్నికల జెండాలు, ఫ్లెక్సీలు, కరపత్రాలను తయారు చేసుకునేందుకు పైసల్లేని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ నాయకులు ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ గాంధీభవన్ బొక్కసం మాత్రం ఖాళీగా దర్శనమిస్తోంది. పార్టీకి నిధులు ఇచ్చేందుకు నేతలెవరూ ముందుకు రావడం లేదు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా తన చేతి చమురు ఎందుకు వదలించుకోవాలనే ఉద్దేశంతో ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఎన్నికలు దగ్గర పడుతున్నా పార్టీ ప్రచార సామగ్రి ఇంతవరకు సిద్ధం కాలేదు. చివరకు గాంధీభవన్‌కు వచ్చే నాయకులు, మీడియాకు టీ, బిస్కెట్లు ఇచ్చేం దుకు కూడా వెనుకాడే పరిస్థితి ఏర్పడింది.

 

ధర్మపురి శ్రీనివాస్ పీసీసీ పగ్గాలు చేపట్టినప్పుడు కాంగ్రెస్ సభ్యత్వం కోసం కార్యకర్తలు చెల్లించిన రూ.3 కోట్లను డిపాజిట్ చేశారు. దానిపై వచ్చే వడ్డీని గాంధీభవన్ నిర్వహణకు వినియోగించేవారు. దీనికి తోడు పార్టీ అధికారంలో ఉన్నందున ప్రభుత్వాధినేత నుంచి ప్రతినెలా రూ.10 లక్షల మేరకు అనధికారికంగా సర్దుబాటు చేసేవారు. డీఎస్ నుంచి బొత్స సత్యనారాయణ పీసీసీ పగ్గాలు చేపట్టిన తరువాత గాంధీభవన్‌ను ఆధునీకరించేందుకు బ్యాంకులో ఉన్న సొమ్మంతా ఖర్చు చేశారు. కానీ కిరణ్ వచ్చాక రూ.10 లక్షలకు బదులు రూ.5 లక్షలు ఇస్తానని ప్రతిపాదించారు. దానితో విభేదించిన బొత్స ఆ సొమ్మును కూడా తీసుకునేందుకు నిరాకరించారు. మంత్రిగా తనకున్న పలుకుబడి, ఇతర నాయకుల సహకారంతో గాంధీభవన్ ఆధునీకరణ, ఇందిరా భవన్ నిర్మాణం పూర్తి చేశారు.

 

టీపీసీసీ, ఏపీసీసీలుగా ఏర్పడే నాటికి గాంధీభవన్ ఖాతాలో సొమ్ము రూ.2 లక్షలకు పడిపోయింది. ప్రభుత్వమే రద్దయినందున అక్కడి నుంచీ చెల్లింపులు ఆగిపోయాయి. ఎన్నికల నేపథ్యంలో గాంధీభవన్‌లో, జిల్లాల్లో కొత్తగా కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాలని పొన్నాల లక్ష్మయ్య ఆదేశించారు. కానీ అందుకు అవసరమైన కంప్యూటర్, ఫోన్, టేబుల్, ఇతరత్రా సదుపాయాలకు డబ్బు లేక కంట్రోల్‌రూం నిర్వాహకులు తలపట్టుకున్నారు.

 

టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అబద్ధాలను, మాట తప్పిన నైజాన్ని ఎండగడుతూ ‘కేసీఆర్....వంద అబద్ధాలు’ పేరుతో బుక్‌లెట్ రూపొందించాలని పొన్నాల ఆదేశించారు. అందుకయ్యే ఖర్చులను ఎలా భరించాలో తెలియక గాంధీభవన్ సిబ్బంది బిక్కమొహం వేసుకున్నారు.