TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎల్టీటీఈ ప్రభాకరన్ కు తమిళనాడు సీఎం నివాళి? రాహుల్ ను లాగిన బీజేపీ!

Published on: Wed May 20, 2026 11:19AM

తమిళనాడు రాజకీయాల్లో  పెను సంచలనం చోటుచేసుకుంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి, ఇటీవలి ఎన్నికల్లో  విజయం సాధించి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిషేధిత ఎల్టీటీఈ ( వ్యవస్థాపకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ వర్ధంతిని పురస్కరించుకుని సీఎం విజయ్ ఆయనకు నివాళులర్పించడం రాజకీయ దుమారానికి దారితీసింది.

ముల్లివైకల్ విషాద దినాన్ని పురస్కరించుకుని సీఎం విజయ్ తన  ఎక్స్  ట్విట్టర్  ఖాతాలో ఒక భావోద్వేగ భరితమైన పోస్ట్‌ను షేర్ చేశారు.  శ్రీలంక అంతర్యుద్ధం ముగింపు దశలో ముల్లివైకల్ ప్రాంతంలో మరణించిన తమిళ సోదరుల త్యాగాలను తమ గుండెల్లో పదిలంగా ఉంచుకుంటామని విజయ్ పేర్కొన్నారు. సముద్రం అవతల ఉన్న తమ తమిళ బంధువుల హక్కుల కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటామంటూ  విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలపై  బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది.

ఈ నేపథ్యంలోనే కమలనాథులు  కాంగ్రెస్ పార్టీని, మరీ ముఖ్యంగా ఆ పార్టీ అగ్రనేత,లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎల్టీటీఈ అధినేతను స్మరించుకుంటూ తమిళనాడు ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటనలు చేస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని  డిమాండ్ చేసింది.  కేవలం అధికారం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసమే  కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ విజయ్ ప్రకటనపై నోరుమెదపడం లేదని బీజేపీ సీనియర్ నేత నారాయణన్ తిరుపతి ఆరోపించారు.

ఇండియాలో బ్యాన్ అయిన  ఒక ఉగ్రవాద సంస్థకు మద్దతుగా ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి నివాళులర్పించడం దేశ సార్వభౌమత్వానికి గొడ్డలిపెట్టుగా బీజేపీ అభివర్ణిస్తోంది. రాజీవ్ గాంధీ ప్రాణాలను బలిగొన్న శక్తులతో తమిళనాడులోని ప్రస్తుత ప్రభుత్వం పరోక్షంగా చేతులు కలుపుతోందని..  దీనికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం అత్యంత విచారకరమని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.

మరోవైపు ఈ  విమర్శలపై ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ  దీటుగా స్పందించింది. ముల్లివైకల్ అనేది శ్రీలంక అంతర్యుద్ధంలో వేలాది మంది అమాయక తమిళ ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఒక చారిత్రక విషాదమని..  ఆ మారణహోమంలో ప్రాణాలు కోల్పోయిన   తమిళ సోదరులకు నివాళులర్పించడం మానవీయ కోణంలో చేసిన పనేనని టీవీకే పేర్కొంది. దీనిని రాజకీయం చేయడం తగదని బీజేపీకి హితవు పలికింది.