TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇరకాటంలో టీ-కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు!

Published on: Fri Apr 27, 2012 10:49AM

నాలుగురోజుల పాటు పార్లమెంట్ నుంచి సస్పెండ్ అయిన టి-కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ఇరకాటంలో పడినట్టు కనిపిస్తోంది. మొదటిరోజు ప్రత్యేక తెలంగాణా కోసం పార్లమెంట్ లో హడావుడి చేయడం, నాలుగురోజుల పాటు సస్పెండ్ కావడం, ఆ బ్రేకింగ్ న్యూస్ టెలివిజన్ లలో ప్రసారం కావడం, పత్రికల్లో పతాకశీర్షికల్లో వేయడం బాగానే అనిపించింది. కానీ తరువాత పరిణామాలు చూస్తుంటే పార్లమెంట్ లో అవసరానికి మించి హడావుడి చేశామా? అనే పశ్చాతాపం కనిపిస్తోంది.

 

 

ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు విషయమై ఎటువంటి హామీ ఇవ్వడానికీ కేంద్రం సిద్ధంగా వున్నట్లు కనిపించడం లేదు. సస్పండ్ చేసిన నాలుగురుజుల గడువు పూర్తవుతోంది. ఎటువంటి హామీ లేకుండా మరలా పార్లమెంట్ లో ప్రవేశిస్తే తమ పరిస్థితి ఏమిటనే ఆలోచనలో పడ్డారు. మొదటి రోజు హడావుడి చేసి, సస్పెండ్ కావడాన్ని కాంగ్రెస్ ఆడుతున్న నాటకం అంటూ తెలంగాణా ప్రాంత బిజెపి నేతలు, టి.ఆర్.ఎస్. నేతలు వ్యాఖ్యానాలు చేశారు. సస్పెండ్ కావడం, పార్లమెంట్ ఎదుట ధర్నాలు చేస్తున్నప్పటికీ పార్టీలోని నేతలు ఎవ్వరూ అంతగా పట్టించుకోకపోవడమం ఎటువంటి హామీలు లేకుండా పార్లమెంట్ లోకి ప్రవేశిస్తే నాటకం అని ప్రతిపక్ష నేతలు చేసిన ఆరోపణలు నిజమని ప్రజలు నమ్మే అవకాశం వుండటమే కాకుండా తాము అభాసుపాలు కావడం ఖాయమని టి-పార్లమెంట్ సభ్యలు ఆందోళన చెందుతున్నారు. ఆందోళన కొనసాగించాలా లేక మెల్లగా పార్లమెంట్ లో చేరిపోవాలా? అనే అంశంపై వారు మల్లగుల్లాలు పడుతున్నారు. సస్పెండ్ అయిన నేపథ్యంలో నాలుగురోజుల పాటు తెలంగాణలో పర్యటించాలని భావించినా, ఆ నాలుగురోజుల వ్యవధి ఢిల్లీ నుంచి రావడానికి, వెళ్ళడానికి సరిపోతుందని, దానివల్ల ప్రయోజనం లేదని విరమించుకున్నారు. తాజాగా అధిస్థానాన్ని బెదిరించడం కోసం టి-కాంగ్రెస్ సభ్యులు ప్రత్యేక ఫోరమ్ ఏర్పాటు చేయడమా లేక తెలంగాణా రాష్ట్ర సమితిలో చేరడమా? అనే అంశంపై ఆలోచన చేస్తున్నట్టు వార్తలను పత్రికలకు విడుదల చేశారు. ఈ బెదిరింపు సాకుగా గౌరప్రదంగా పార్లమెంట్ లో ప్రవేశించవచ్చని వారు భావిస్తున్నారు.