పోలవరంలో కొనసాగుతున్న కాంగ్రెస్ సస్పెన్స్
Published on: Sat Apr 28, 2012 10:16AM
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టిక్కెట్టు ఎవరికీ ఇవ్వాలన్న విషయంపై కాంగ్రెస్ పార్టీలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ టిక్కెట్టు కోసం 9మంది ఆశావాదులు పోటీపడ్డారు. వీరిలో బోజ్జిదొర లేదా బొరగం శ్రీనివాసుల్లో ఎవరో ఒకరికి టిక్కెట్టులభించవచ్చన్న ప్రచారం కూడా జరిగింది. పోలవరం నియోజకవర్గంలో కీలకనేత ఒకరు బోజ్జిదొరకు గట్టిగా మద్దతు ఇస్తుండగా మిగతావారు మాత్రం ఈయనకు బదులుగా మరొకరిని రంగంలోకి దించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బోజ్జిదొర కంటే బొరగం శ్రీనివాసును రంగంలోకి దింపితే విజయావకాశాలు మెరుగుపడతాయని కొందరు అధిష్టానానికి లేఖలు పంపుతున్నారు. బొరగం శ్రీనివాసు 2009 ఎన్నికల్లో పి.ఆర్.పి. అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఒకవైపు తెలుగుదేశం మరోవైపు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశాయి. ఈ ఇద్దరూ గ్రామగ్రామాన తిరుగుతూ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కానీ, కాంగ్రెస్ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయకపోవటంతో ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.


