TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పరుగుల వైభవం సూర్యవంశి

Published on: Sat Apr 11, 2026 9:49AM

ఐపీఎల్ 2026లో భాగంగా గువహటి వేదికగా  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) మధ్య శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పరుగుల వైభవం ముచ్చట గొలిపింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యంతో విరుచుకుపడిన ఈ బుల్లోడు..   బెంగళూరు బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. హుజిల్ వుడ్ వంటి అనుభవజ్ణులైన బౌలర్లను కూడా లెక్క చేయకుండా సిక్సర్ల మోత మోగించాడు. 

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో  తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20  ఓవర్లలో 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. రజత్ పాటిదార్ 63 పరుగులు, కృనాల్ పాండ్యా  43 నాటౌట్ రాణించడంతో బెంగళూరు 200 పరుగుల మార్క్ దాటింది.  202 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు వైభవ్ సూర్యవంశీ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

వైభవ్   ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సరు ఉన్నాయి. వైభవ్ సూర్యవంశి  కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. అనుభవజ్ఞులైన జోష్ హేజిల్‌వుడ్ వంటి బౌలర్లను సైతం లెక్క చేయకుండా సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడిన వైభవ్ సూర్యవంశి బ్యాటింగ్ వైభవం స్టేడియాన్ని హోరెత్తించింది. ఆర్సీబీ అభిమానులు సైతం ఈ కుర్రాడి జోరును సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉండిపోయారు.   వైభవ్ విధ్వంసం కారణంగా రాజస్థాన్ రాయల్స్ లక్ష్యాన్ని  18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది.  

గతంలోనే అండర్-19 ప్రపంచకప్‌లో సత్తా చాటిన వైభవ్, ఇప్పుడు ఐపీఎల్ వేదికపైనా తనదైన ముద్ర వేస్తున్నాడు. 15 ఏళ్ల ప్రాయంలోనే అంతర్జాతీయ స్థాయి బౌలర్లను ఎదుర్కోవడంలో అతను ప్రదర్శిస్తున్న పరిణతిని క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.  తన అద్భుత ప్రదర్శనతో వైభవ్ సూర్యవంశీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. అలాగే  ఆరెంజ్ క్యాప్ రేసులోనూ ముందంజలో నిలిచాడు.