ప్రమాద బాధితులను పరామర్శించిన చంద్రబాబు
posted on Jan 7, 2018 12:43PM
కృష్ణాజిల్లా గన్నవరం మండలం సూరంపల్లి ఎలీప్ ఇండస్ట్రీయల్ ఎస్టేట్లో నిన్న అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబసభ్యులను.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించి, ఓదార్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటన చాలా బాధాకరమని.. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు జరిగి ఉండేవి కావన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.. తీవ్ర గాయాలైన వారికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థికసాయం చేస్తామన్నారు. నిన్న సాయంత్రం ఐరన్ ఫ్యాక్టరీలోని జీఎస్ ఎల్లాయిస్ క్యాస్టింగ్ లిమిటెడ్ యూనిట్-2లో.. బాయిలర్ పేలి ద్రవరూపంలో ఉన్న ఇనుము పొంగి కార్మికులపై పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించగా.. చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.