TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నార్మన్ ఫోస్టర్ పిటిషన్ పై జగన్ సర్కార్ కు సుప్రీం నోటీసులు

Published on: Thu Aug 11, 2022 3:29PM

ఒక‌రి గొప్ప‌త‌నాన్ని ఓర్వలేని తనంతో తిరస్కరించడం,ఒక‌రి దార్శనికత జాతికి మేలు చేస్తుందని తెలిసినా  నిర్ల‌క్ష్యం చేయ‌డ‌మో అమ‌లు కాకుండా అట‌కెక్కించ‌డ‌ం క్ష‌మార్హం కాదు. క్షంతవ్యం కాదు. జగన్ సర్కార్ సరిగ్గా అలా క్షంతవ్యంకాని వ్యవహార శైలినే ఈ మూడేళ్లుగా చేస్తూ వస్తున్నది.  నాడు నారా చంద్ర‌బాబునాయుడు ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా రాజ‌ధాని నిర్మాణ ప‌ను ల‌ కోసం విదేశీయుల‌తో సంప్ర‌దిచ‌డం మీద అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

కానీ ఆయ‌న దూర‌దృష్టిని  గ్ర‌హించి విమర్శకులంతా ఆ తరువాత మెచ్చుకున్నారు. ఆయన నిర్ణయాన్ని గౌరవించారు.  ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత  రాజ‌ధానిగా అమ‌రావ‌తిని దేశనికే తలమానికంగా నిర్మించాలని  చంద్రబాబు ప్ర‌భుత్వం కంక‌ణం క‌ట్టుకుంది. కానీ అందుకు సంబం ధించి కొంత వ‌రకే ప‌నులు సాకార‌మ‌య్యాయి. ఆ త‌ర్వాత వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. రాజధాని అమరావతి వైభోగాన్ని, ప్రాశస్థ్యాన్ని కొనసాగనీయరాదని నిర్ణయించుకుంది.

మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటక తెరతీసింది.  ఆ ప్రయత్నంలో అన్ని విధాలుగా అభాసుపాలైంది. అదలా ఉంచితే.. టీడీపీ  హయాంలో అమరావతి నిర్మాణం కోసం నార్మన్ అండ్ ఫోస్టర్ కంపెనీ డిజైన్లు సిద్ధం చేసింది. అయితే అధికారం లోకి రాగానే అమరావతి నిర్మాణాన్ని  జగన్‌ పక్కన పెట్టారు. అంతే కాదు గత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని అమరావతి భవనాలకు డిజైన్లు సిద్ధం చేసిన  నార్మన్ అండ్ ఫోస్టర్ కంపెనీ  తమకు చెల్లించాల్సిన సొమ్ముల కోసం ఇచ్చిన నోటీసులను జగన్ సర్కార్ పట్టించుకోలేదు.  

దీంతో నార్మన్ అండ్ పోస్టర్ కంపెనీ  సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఈ మేర‌కు జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు  నోటీసులు జారీ చేసింది. అమరావతి విషయంలో జగన్ సర్కార్ తీసుకున్న ప్రతి నిర్ణయం బెడిసి కొట్టిందనే చెప్పాలి.    మూడు రాజ‌ధానుల నిర్ణయం   పాల‌నా సౌల‌భ్యం కోస‌మేనని జగన్ సర్కార్ చెప్పిన కారణాన్ని ఎవరూ ఆమోదించలేదు. అమ‌రావ‌తి రాజ‌ధానికి భూములు ఇచ్చిన‌ రైతులు వ్యతిరేకించారు. విపక్షాలు తప్పుపట్టాయి. చివరికి న్యాయస్థానమూ అది కుదరదని విస్పష్టంగా తీర్పు చెప్పింది.