సుప్రీంకోర్టులో ఎల్జీ పాలిమర్స్‌కు ఎదురుదెబ్బ

సుప్రీంకోర్టులో ఎల్జీ పాలిమర్స్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ ప్రాంగణంలోకి ఎవరినీ అనుమతించరాదంటూ ఇటీవల ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై.. ఎల్జీ పాలిమర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్లాంట్ ని సీజ్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై విచారణ కోరుతూ సుప్రీం కోర్టులో ఎల్జీ పాలిమర్స్ పిటిషన్ దాఖలు చేయగా.. జస్టిస్ లలిత్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్లాంట్ లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అత్యవసరంగా వెళ్లేందుకు తమను అనుమతించాలంటూ ఎల్జీ పాలిమర్స్ విజ్ఞప్తి చేసింది. 

అయితే, హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏ వాదనలనైనా హైకోర్టు, ఎన్జీటీ ముందే వినిపించాలని ఆదేశించింది. ఎన్జీటీ లేదా హైకోర్టు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తాయని, ఆయా విచారణలు ముగిసిన తర్వాతే సుప్రీం కోర్టుకు రావాలని స్పష్టం చేసింది. ఈ పిటిషన్ పై తాము తదుపరి విచారణ చేపట్టలేమంటూ ఎల్జీ పాలిమర్స్ కు సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.