రాఫెల్ డీల్.. కేంద్రానికి బిగ్ షాక్

 

రాఫెల్‌ ఒప్పందం అంశంలో కేంద్రానికి సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఒప్పందంలో కేంద్రం అభ్యంతరాలపై ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు కీలక తీర్పును ఇచ్చింది. కేంద్రం లేవనెత్తిన ప్రాథమిక అభ్యంతరాలను తోసిపుచ్చిన కోర్టు.. విపక్షాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ల మెరిట్‌ ఆధారంగా సమగ్ర విచారణ చేపడతామని స్పష్టం చేసింది. విచారణ తేదీని త్వరలోనే నిర్ణయిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది.

రాఫెల్‌ ఒప్పందంలో ఎలాంటి అవకతవకలు జరగలేదంటూ గతేడాది డిసెంబరు 14న సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఒప్పందాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ తీర్పుపై మరోసారి సమీక్ష జరపాలని కోరుతూ ప్రశాంత్‌ భూషణ్‌, అరుణ్‌ శౌరీ, యశ్వంత్‌ సిన్హా న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. అదే సమయంలో రాఫెల్‌ ఒప్పందానికి సంబంధించిన కొన్ని కీలక పత్రాలు బహిర్గతమయ్యాయి. వీటిని ది హిందూ పత్రిక ప్రచురించగా.. ఆ పత్రాలను రివ్యూ పిటిషనర్లు కోర్టుకు సమర్పించారు. ఆ పత్రాల ప్రాతిపదికన విచారణ జరపాలని కోరారు. అయితే దీనిపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. రక్షణశాఖ నుంచి ఆ పత్రాలను దొంగలించి వాటి ఫొటో కాపీలను కోర్టుకు ఇచ్చారని.. ఆ పత్రాల ఆధారంగా తీర్పును రివ్యూ చేయడం సరికాదని పేర్కొంది.

వాదోపవాదాలు విన్న అనంతరం కేంద్రం లేవనెత్తిన ప్రాథమిక అభ్యంతరాలను న్యాయస్థానం కొట్టివేసింది. పిటిషనర్లు దాఖలు చేసిన పత్రాల మెరిట్‌ ఆధారంగా రివ్యూ పిటిషన్లపై విచారణ జరిపేందుకు న్యాయస్థానం అంగీకరించింది.