TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సుప్రీంకోర్టు.. నైతికతను బోధించే సంస్థ కాదు..!

Published on: Sat May 6, 2023 9:58AM

సమాజానికి నైతికత, విలువల గురించి బోధించే సంస్థ సుప్రీంకోర్టు కాదని, దేశంలో చట్టబద్ద పాలన కొనసాగేలా చూడడం, రాజ్యంగ పరిరక్షణే దాని ప్రధాన కర్తవ్యమని జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ ఎ. అమానుల్లా ధర్మాసనం పేర్కొంది. తన ఇద్దరు కుమారులకు విషమిచ్చి చంపిన కేసులో 20 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న మహిళను జైలు నుంచి విడుదల చేయడానికి అనుమతిస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆమె అభ్యర్థనను పరిశీలించిన రాష్ట్ర స్థాయి కమిటీ.. ముందుగానే జైలు నుంచి విడుదల చేయాలని సిఫార్సు చేసినప్పటికీ నేర తీవ్రత దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం 2019లో తిరస్కరించింది.

దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసును పరిశీలించిన ధర్మాసనం... పరాయి పురుషుడితో ప్రేమలో పడిన ఆమె... అతని బెదిరింపులు, ఒత్తిడితో తన ఇద్దరు కుమారులకు విషమిచ్చి తానూ ఆత్మహత్య చేసుకోవాలని భావించిందని పేర్కొంది. అయితే, పిల్లలిద్దరికీ విషమిచ్చిన తర్వాత ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకోబోతుండగా ఆ సమయంలో అక్కడికి వచ్చిన బంధువు ఒకరు అడ్డుకున్నారని తెలిపింది. ప్రేమికుడితో సంతోషంగా గడపడానికే ఆమె బిడ్డలను చంపిందన్న తమిళనాడు ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. ఆమెను విడుదల చేయాలన్న రాష్ట్రస్థాయి కమిటీ సిఫార్సును ఆమోదించకపోవడంలో సహేతుకత కనిపించడంలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. తక్షణమే ఆమెను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది.

హత్య, ఆత్మహత్యాయత్నం కేసుల్లో 2005లో దిగువ కోర్టు ఆమెకు జైలు శిక్ష విధించగా... ఆత్మహత్యాయత్నం కేసు నుంచి హైకోర్టు ఆమెకు పాక్షికంగా విముక్తి కల్పించింది. తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఆ మహిళ తన బిడ్డలకు విషమిచ్చి, తానూ మరణించాలని భావించిందని ధర్మాసనం పేర్కొంది.

సమాజంలో నైతికత, విలువలను ఎవరికి వారే అలవర్చుకోవాలి. వీటిని బోధించే సంస్థగా సుప్రీంకోర్టు వ్యవహరించదని ధర్మాసనం పేర్కొంటున్న నేపథ్యంలో.. వీటిని అలవర్చుకోవాల్సిన బాధ్యత పౌరులపైనే ఉందనేది యదార్థం.