ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీం కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేసింది. పంచాయతీ ఎన్నికలు యధావిధిగా నిర్వహించాలని ఆదేశించింది. తాజా తీర్పుతో ఏపీ పంచాయతీ ఎన్నికలకు అడ్డంకులు తొలగినట్టుయింది.

ఇక విచారణ సందర్భంగా జస్టిస్ కౌల్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగట్లేదా అని ప్రశ్నించారు. ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగమన్న ఆయన.. కరోనా ఉన్నప్పుడు ఎన్నికలు కావాలన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల సంఘాన్ని తప్పుబడుతూ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని, ఎన్నికలు ప్రతీసారి వాయిదా పడుతున్నాయని జస్టిస్‌ కౌల్‌ పేర్కొన్నారు.