కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం సీరియస్...


ఈ మధ్య ప్రభుత్వ పథకాలకి ఆధార్ ను తప్పనిసరి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపై మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పని సరి చేయొద్దంటూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం అవేమి పట్టించుకోకుండా వ్యవహరించడంతో ఇప్పుడు మరోసారి కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పాన్ కార్డుకు ఆధార్ ను ఎందుకు తప్పనిసరి చేశారని...పాన్ కార్డు పొందడానికి ఆధార్ కార్డును ఎలా తప్పనిసరి చేస్తున్నారంటూ ప్రశ్నించింది. తాము ఆధార్ ను ఆప్షనల్ గా చేయాలని ఆర్డర్ ఇచ్చినప్పుడు, తప్పనిసరి అని ఎలా ఆదేశిస్తారంటూ కేంద్రంపై మండిపడింది. కాగా గత నెల సవరించిన ఆర్థికబిల్లులో బ్యాంకు అకౌంట్లకు, పాన్ కార్డుకు, ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కు ఆధార్ ను కేంద్రం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తదుపరి విచారణ ఏప్రిల్ 25 కి వాయిదా వేసింది.