వైసీపీలో తమ్మినేనికి ఉక్కపోత?.. అయినా కొనసాగక తప్పని అనివార్యత.!
Published on: Fri Aug 21, 2026 3:40PM

తమ్మినేని సీతారాం.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు తమ్మినేని సీతారాం. అయితే ప్రస్తుతం ఆయన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా ఉంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న తమ్మినేని సీతారాం ఆ పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నారు. పట్టించుకునే నాధుడే లేడు. పార్టీలో పలకరించే దిక్కు లేదు. ఆయన పార్టీలో ఉన్నారంటే ఉన్నారంతే.. సీనియారిటీకి గుర్తింపు లేదు. పార్టీ అధినేత జగన్ పట్టించుకోరు. దీంతో తమ్మినేని రాజకీయ ప్రయాణం గందరగోళంలో పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయంలోనూ, ఆ తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు తమ్మినేని సీతారాం. వైసీపీ హయాంలో శాసనసభ స్పీకర్గా బాధ్యతలు నిర్వహించారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీలో ఆయన ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఆయనకు పార్టీ పరంగా ఇసుమంతైనా ప్రాముఖ్యత లభించడం లేదు.
పార్టీ కార్యక్రమాలు, నిర్ణయాల్లో ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
Suffocation to Tammineni Seetharam in YCP, YCP Politics, YS Jagan Mohan Reddy, Srikakulam Politics, TeluguOne


