TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నాలుగు స్తంభాలాట.. ఏపీలో వారసుల వార్!

Published on: Thu Jul 6, 2023 12:19PM

ఏపీలో రాజకీయాలు ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారాయి. ఎన్నికలకు ఇంకా పది నెలల సమయం ఉండగానే దాదాపుగా అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఎత్తులు పై ఎత్తులు మొదలు పెట్టాయి. దాదాపుగా అన్ని పార్టీలకు రాబోయే ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమే కానున్నాయి. అధికార పార్టీ వైసీపీ  జగన్ పాలనకు రెఫరెండంగా వచ్చే ఎన్నికలను భావిస్తుంటే,  టీడీపీ  చంద్రబాబు దార్శనికతపై ప్రజలలో ఉన్న నమ్మకానికి ఈ ఎన్నికలు గీటురాయిగా భావిస్తోంది.  ఇక, జనసేనకు సైతం ఈ ఎన్నికలే ప్రజలలో  పవన్ పై ఏ మేరకు విశ్వాసం ఉందన్న విషయానికి పరీక్షగా మారాయి.  కాగా  ఏపీలో  ఈసారి ఎన్నికలలో  మరో  ఆసక్తికర అంశం కనిపిస్తుంది. అదే వారసుల మధ్య పోరు.

ఏపీలో ఇప్పుడు నలుగురు వారసుల మధ్య ఆసక్తికర పోరు కనిపిస్తుంది. ఇప్పటికే నలుగురూ రాజకీయాలలో కీలకంగా ఉన్నా రానున్న ఎన్నికలలో ఈ నలుగురి మధ్య జరగనున్న పోరు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. వారెవరో కాదు.. మాజీ సీఎం రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కుమార్తె వైఎస్ షర్మిల, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్, మాజీ సీఎం నందమూరి తారక రామారావు కుమార్తె పురంధేశ్వరి. ఈ నలుగురు మాజీ ముఖ్యమంత్రుల వారసులే కాగా ఇప్పుడు ఈ నలుగురి మధ్యా జరుగుతున్న రాజకీయ పోరు అత్యంత ఆసక్తికరంగా మారింది.  

ముందుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీసుకుంటే ఆయనకు  ప్రధాన పోటీ లోకేష్. టీడీపీ నుండి సీఎం అభ్యర్థి చంద్రబాబు నాయుడే అయినా.. రానున్న ఎన్నికలలో పార్టీని విజయపథంలో నడిపించే విషయంలో కర్త, ఖర్మ, క్రియ అన్నీ లోకేషే కానున్నారు. వైఎస్ఆర్, చంద్రబాబు సమకాలికులు కాగా ఇప్పుడు తదననుగుణంగానే వారసుల మధ్య పోటీ అనివార్యమైంది. ఇప్పటికే టీడీపీ ఐకాన్ గా లోకేష్ పాదయాత్రలో ఉన్నారు.  సంపూర్ణ ఆరోగ్యంగా చంద్రబాబు యువకులతో పోటీపడుతున్నా..తండ్రిని మించిన తనయుడిగా రుజువు చేసుకునే క్రమంలో లోకేష్ రాటుదేలుతున్నారు.  ఔనన్నా కాదన్నా జగన్ మోహన్ రెడ్డికి ఎటు చూసినా లోకేషే పోటీ. లోకేష్ కు కూడా జగన్ మోహన్ రెడ్డినే పోటీ. తండ్రి చంద్రబాబు జగన్ తండ్రి వైఎస్ఆర్ తో తలపడితే ఇప్పుడు ఆయన కుమారుడిని లోకేష్ ఢీ కొట్టాల్సిన పరిస్థితి అనివారమైంది.

మరోవైపు వైఎస్ఆర్ కుమార్తె షర్మిలతో కూడా వైఎస్ఆర్ కుమారుడు జగన్ పోటీకి దిగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. షర్మిల తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనుందనే ప్రచారం తెలిసిందే కాగా.. అదే జరిగితే కాంగ్రెస్ నుండి షర్మిల.. వైసీపీ నుండి జగన్ తలపడాల్సి వస్తుంది. ఇప్పటికే పులివెందుల నుంచి షర్మిల బరిలోకి దిగుతుందా అన్న చర్చ అయితే మొదలైంది. అదే సమయంలో షర్మిలతో మాజీ సీఎంలు చంద్రబాబు కుమారుడు లోకేష్, బీజేపీ అధ్యక్షురాలిగా ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి కూడా  పోటీకి దిగాల్సి వస్తుంది. అదే సమయంలో పురంధేశ్వరికి జగన్ తో కూడా వార్ తప్పదు. అలాగే బీజేపీతో టీడీపీ పొత్తు కుదరకపోతే పురంధేశ్వరి చంద్రబాబు,  లోకేష్ తో కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది.

మొత్తంగా చూస్తే రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ వర్సెస్ చంద్రబాబు కుమారుడు లోకేష్,  వైఎస్ఆర్ కుమార్తె షర్మిల, ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి.. చంద్రబాబు కుమారుడు లోకేష్ వర్సెస్ వైఎస్ఆర్ కుమారుడు జగన్, కుమార్తె షర్మిల.. వైఎస్ఆర్ కుమార్తె షర్మిల వర్సెస్ కుమారుడు జగన్, చంద్రబాబు కుమారుడు లోకేష్, ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి.. ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి వర్సెస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల, కుమారుడు జగన్ ఇలా నువ్వా నేనా అన్నట్లు వారసుల మధ్య ఆసక్తికర రాజకీయ పోటీ కనిపిస్తుంది. మరి ఈ పోటీలో ఈసారి నెగ్గేదెవరో తగ్గేదెవరో చూడాలి. ఈ నలుగురూ ఎన్నికల బరిలో ముఖాముఖి తలపడే పరిస్థితి ఉండకపోయినా వారు ప్రాతినిథ్యం వహించే పార్టీలను విజయ పథంలో నడిపించే విషయంలో మాత్రం తీవ్రంగా పోటీ పడక తప్పని పరిస్థితులు ఉన్నాయి.