సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణ జరగదు : సీఎం చంద్రబాబు
Published on: Mon Jul 20, 2026 4:26PM
.webp)
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు (ఆర్ఎస్కేలు) ఏర్పాటు చేస్తున్నామని, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కాదని స్పష్టం చేశారు.
రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ... పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా సేవలు మరింత సులభతరం అవుతాయని, ప్రజల్లో అపోహలు తొలగించే బాధ్యత అధికారులదేనని సూచించారు.
డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు సీఎం. వారి ఉపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తామని హామీ ఇచ్చారు. దీపం-2.0 లబ్ధిదారులకు సబ్సిడీని నిర్ధారిత తేదీల్లో జమ చేసే విధానాన్ని అమలు చేయాలని పౌర సరఫరాల, ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన సాంకేతిక ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు.
సమీక్షలో లిటిగెంట్ పిటిషనర్ల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ప్రజా ప్రయోజనం లేకుండా వరుసగా ఫిర్యాదులు చేసే వారిని గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనం ఉన్న ఫిర్యాదులను మాత్రమే ప్రాధాన్యంతో పరిశీలించాలని సూచించారు.
రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షపాతం 49 శాతం లోటుగా ఉందని పేర్కొన్న సీఎం... రైతులను డ్రై క్రాప్స్ వైపు ప్రోత్సహించాలని, ప్రత్యామ్నాయ సాగుపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే వీబీజీ–రామ్జీ, జలధార పనులను సమన్వయంతో చేపట్టాలని సూచించారు.
ప్రజాభిప్రాయాలను నిరంతరం తెలుసుకుంటూ పరిపాలనను మెరుగుపరచాలని, సమస్యలు తలెత్తిన తర్వాత కాకుండా ముందుగానే అంచనా వేసి చర్యలు తీసుకునే విధానాన్ని అధికారులు అలవర్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు
Sub-Registrar Offices, No Privatization, False Propaganda, RSC, Citizen-Centric Services,
Passport Seva Kendra Model, Easier Registration Process,Document Writers, RTGS Review
CM N. Chandrababu Naidu, Litigant Petitioners


