గుంటూరు జిల్లాలో కాపుల అసంతృప్తి
Published on: Fri May 4, 2012 9:51AM
గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి గట్టిమద్దతుదార్లుగా ఉన్న కాపు సామాజికవర్గంలోని చాలామంది నాయకులు ప్రస్తుతం ఆ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గడిచిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కనపెట్టింది. ఈ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో సుమారు 20 వేలమంది కాపు ఓటర్లు ఉన్నారు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈ వర్గాన్ని పూర్తిగా విస్మరించింది.
పార్టీకి గత 28 ఏళ్ళుగా సేవలందించిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా ఇవ్వకుండా అవమానించారు. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందని ఆయన అనుమానిస్తున్నారు. ఉమ్మారెడ్డికి జరిగిన అవమానంతో గుంటూరు జిల్లాలోని కాపులు రగిలిపోతున్నారు. ఉమ్మారెడ్డితో పాటు జిల్లాలో
ఇదే వర్గానికి చెందిన శనక్కాయల అరుణ, సాంబశివరావు లాంటి నాయకులు కూడా పార్టీని వదిలివెళ్ళే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్, వంగవీటి రాధాకృష్ణను అక్కున చేర్చుకున్నారు. తాను రాముడిని అయితే రాధ లక్ష్మణుడని ఆయన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని బహిరంగంగా జగన్ చేసిన ప్రకటన కాపు సామాజిక వర్గాన్ని ఎంతో ఆకర్షిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లాలో ఈ సామాజిక వర్గానికి చెందిన నేతలు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ వైపు దృష్టిసారిస్తున్నారు.


