TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉప ఎన్నికల్లో గెలుపునకు హస్తిన హస్తంనేతల కసరత్తులు

Published on: Fri May 11, 2012 7:11AM

రాష్ట్రంలో జరుగనున్న 18 అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థానం ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం హస్తాన (ఢిల్లీ) హస్తం (కాంగెస్) నేతలు కసరత్తులు చేస్తున్నారు. దీనిలో భాగంగానే రాష్ట్ర రాజధానికి హస్తిన నేతల తాకిడి పెరిగింది. లోక్ సభ సమీవేశాలు పూర్తయ్యాక ఉప ఎన్నికలపై మరింత దృష్టి సారించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేసిన సూచనల ప్రకారం మరికొందరు నేతలు రాష్ట్రానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికలపై ఎఐసిసి తరపున ముగ్గురు నేతలు దృష్టిసారించారు.

 

 

రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్చి గులాంనబీ ఆజాద్, రాష్ట్ర పార్టీ సహాయకుడు ఎఐసిసి కె.బి. కృష్ణమూర్తి, ఎఐసిసి పరిశీలకుడు వాయలార్ రవి రోజూ వారీ సమీక్షల్లో పాల్గొని తమ నివేదికలను సోనియాగాంధీకి అందిస్తున్నారు. వీరితో పాటు మరికొందరిని పంపించైనా ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలు మేరుగుపరచుకోవాలని సోనియాగాంధీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగ్నగానే కె.బి.కృష్ణమూర్తి అసెంబ్లీల వారీగా సమాచారం సేకరించి ఎక్కడ పార్టీ బలహీనంగా ఉందో వివరాలను ఢిల్లీకి అందజేశారని తెలుస్తోంది.

 

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరపున ఈ ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి మోస్తున్నారు. వీరితోపాటు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎన్నికలు జరుగుతున్నా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. కార్యకర్తలను ఈ ముగ్గురూ ఏ మేరకు ప్రభావితం చేస్తున్నారు, ఎంత వరకూ నియోజకవర్గంలో కాంగ్రెస్ వెనుకబడి ఉందో వివరాలను ఎఐసిసి తరపున నియోజకవర్గస్థాయి సమీక్షలను వాయలార్ రవి కూడా తెలుసు కుంటున్నారని సమాచారం అందుతోంది. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే 2014 ఎన్నికల్లో తిరిగి అధికారం సాధించటం ఏమంత కష్టం కాదని సోనియా భావిస్తోందని తెలుస్తోంది.

 

ప్రత్యేకించి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కారణంగానే ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయని ప్రచారం చేయాలని ఎఐసిసి సూచించినట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల జరిగిన ప్రతీ సభలోనూ జగన్ ను విమర్శిచిన తరువాత పై విషయాన్ని బొత్స సత్యనారాయణ ప్రచారం చేస్తున్నారు. కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకుల బుజ్జగింపుల్లో బొత్సా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలవకపోతే సిఎం, పిసిసి అధ్యక్షుని స్థానాలు ఖాళీ అవుతాయని హెచ్చరికలూ, సంకేతాలూ ఢిల్లీ నుంచి వచ్చాయని తెలిసింది.

 

అందుకే వీరిద్దరూ ఈ ఎన్నికలను అత్యంత కీలకంగా భావిస్తున్నారని తెలుస్తోంది. మరో నెలలో 18 అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థానానికి ఎన్నికలు జరిగే అవకాశాలున్నందున 70 శాతం స్థానాల్లో విజయం కావాలని ఎఐసిసి కోరినట్లు సమాచారం. అందుకనే హస్తిననేతలను ఉపయోగించుకుని ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రికి ఎఐసిసి ఆదేశించింది. దీనిలో భాగంగానే ఆయన తిరుపతిలో తన సోదరుడితో పాటు మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో నమ్మకస్తులను ఎంపిక చేసుకుని వారితో రోజువారీ సమీక్షలు చేస్తున్నారని తెలిసింది.

 

 

ప్రతీ నియోజకవర్గంలోనూ ఎ హామీ ఇస్తే ఎన్నికల్లో గెలుస్తామో చెప్పాలని సిఎం కోరుతున్నారట. ఆ హామీ నెరవేర్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సిఎం భరోసా కూడా ఇస్తున్నారని సమాచారం. దీంతో ఇప్పటివరకూ విజయావకాశాలు తక్కువ ఉన్న స్థానాల్లో ద్వితీయశ్రేణి నాయకులే స్థానిక అవసరాలపై హామీలను గుప్పిస్తున్నారని తెలుస్తోంది. ఈ హామీలు ఓట్లు కురిపిస్తే కాంగ్రెస్ విజయావకాశాలు నల్లేరు మీద నడక అని, కానీ జగన్ ప్రభావం వల్ల ఆ హామీలను ఓటర్లు నమ్మకపోతే ప్రత్యామ్నాయం హస్తిననేతలు సూచిస్తారని ఎఐసిసి పెర్కొందట. ఏదేమైనా రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ఎఐసిసికి ప్రతిష్టాత్మకంగా మారాయి.