TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇంకా మూడు రాజధానుల భ్రమేనా!?

Published on: Thu Mar 24, 2022 6:03PM

వైసీపీ నేతలు, జగన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంకా మూడు రాజధానుల భ్రమల్లోనే ఉన్నారనిపిస్తోంది. వందలాది రోజుల పాటు రాజధాని ప్రాంతం రైతులు, మహిళా రైతులు చేసిన ఉద్యమం, హైకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు అనంతరం కూడా వారు ఇంకా అదే భ్రమల్లో ఉండిపోయారనే వ్యాఖ్యలు వస్తున్నాయి. పైగా నాలుగైదు వందల ఏళ్ల నుంచి నగరాలను అభివృద్ధి చేస్తే.. చంద్రబాబు మాత్రం నాలుగైదేళ్లలోనే అమరావతి నగరాన్ని కట్టేయాలనే భ్రమపడ్డారంటూ అసెంబ్లీ వేదికగా సీఎం జగన్, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనడాన్ని ఏమనుకోవాలి భ్రమ అని కాక? అని అందరూ అనుకుంటున్నారు. ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ అంశంపై స‌భ‌లో జరిగిన చర్చ సందర్భంగా ఆర్థిక, శాసన వ్యవహారాల మంత్రి బుగ్గన, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాట్లాడిన మాటల తీరుపై విమర్శలు వస్తున్నాయి.

కోర్టు మొట్టికాయలు వేసినా వైసీపీ ప్రభుత్వం ఇంకా మూడు రాజధానుల బిల్లుకే కట్టుబడి ఉందంటూ సీఎం జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు. ఏపీలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని హైకోర్టు తీర్పు చెప్పినా.. అమరావతిలోనే రాజధాని అంటూ భవనాల నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయించినా ఇంకా మూడు రాజధానులంటూ మాట్లాడడం తగదని అంటున్నారు. రాజధాని ఎక్కడ ఉండాలనే దానిపై రాష్ట్ర శాసనసభకు అధికారం లేదని హైకోర్టు చెప్పడం సరికాదంటూ సీఎం జగన్ రెడ్డి అనడం ఏంటనే ఆగ్రహం వ్యక్తం అవుతోంది. సీఎం జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన, ఎమ్మెల్యే ధర్మాన మాట్లాడిన తీరు చూస్తుంటే.. ‘అయిపోయిన పెళ్లికి బాజా వాయించినట్లు‘ ఉందంటున్నారు.

వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసమే తమ ప్రభుత్వం వికేంద్రీకరణ నినాదం ఎత్తుకుందని మంత్రి బుగ్గన చెప్పడంలోని ఔచిత్యాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. పనిలో పనిగా ఒకరి హక్కును మరొకరు లాక్కోకూడదంటూ న్యాయ వ్యవస్థపైనా మంత్రి బుగ్గన వ్యాఖ్యానించడాన్ని తప్పుపడుతున్నారు. ప్రాంతాల మధ్య అసమానతలు తొలగించి, సమానత్వం సాధించేందుకే తాము మూడు రాజధానుల మంత్రం జపిస్తున్నామంటున్నారు. అంటే రాజధాని ప్రాంతం కాకపోతే అభివృద్ధి జరగదనా..? లేక అభివృద్ధి చేయబోమనేది మంత్రిగారి ఉద్దేశమా? అని నిలదీస్తున్నారు.

ఇక.. చట్టాలకు రూపకల్పన చేసే బాధ్యత జాతీయ స్థాయిలో పార్లమెంటుకు, రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీకి మాత్రమే ఉందంటూ ఇదే చర్చలో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చెప్పుకొచ్చారు. అంటే శాసన వ్యవస్థలో న్యాయవ్యవస్థ వేలు పెట్టడం ఏంటనేది ఆయన పాయింట్ ఆఫ్ ఆర్డర్ గా ఉంది. ఒక పక్కన కేంద్రం, మరో పక్కన న్యాయస్థానం అమరావతే రాజధాని అని తేల్చే చెప్పిన తర్వాత కూడా బరితెగించి మరీ ఇలా మూడు రాజధానులంటూ మాట్లాడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న జనం నుంచి వస్తోంది. పైగా ఒక వ్యవస్థను మరో వ్యవస్థ పలుచన చేస్తోందనేది ధర్మానవారి ధర్మ ప్రవచనం. ఒక పక్కన రైతులు, మరో పక్కన కేంద్రం, ఇంకో వైపున కోర్టు తెగేసి చెబుతున్నా మొండిగా మూడు రాజధానులు అంటున్న వైసీపీ నేతలను ఏమనాలి అంటున్నారు. ‘రాజు కంటే మొండివాడు బలవంతుడు’ అనే సామెతను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు. ఒక పక్కన కోర్టులంటే గౌరవం ఉందంటున్న ధర్మాన మరో పక్కన కోర్టు తీర్పుపై వ్యాఖ్యలు చేయడంపై జనంలో ఆగ్రహం వ్యక్తం అవుతుండడం గమనార్హం.

రాజధాని అమరావతి నిర్మాణం పనులు పూర్తి చేయాలని హైకోర్టు గడువు పెట్టి మరీ ఆదేశించిన తర్వాత కూడా పరిపాలన వికేంద్రీకరణ అంటూ అసెంబ్లీలో చర్చించడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తున్నారు.