TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పుదుచ్చేరికి రాష్ట్ర హోదా... రంగస్వామి ముందు పెను సవాలు

Published on: Mon May 4, 2026 4:45PM

 

పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి రాష్ట్రహోదా కల్పించే గురుతరబాధ్యత ఆయనకు  ఈ సారి పెను సవాల్‌గా మారనుంది. ఆయన గతంలో 2001 నుండి 2008 వరకు రెండు సార్లు, 2011 నుండి 2016 వరకు కాంగ్రెస్ నుంచి  ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్‌తో రాజకీయ జీవితం ప్రారంభించిన రంగస్వామి  2011లో కాంగ్రెస్ నుండి విడిపోయి ఏర్పడిన ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్‌సి) అని తన పేరుతో సొంత పార్టీని స్థాపించారు. 

2011 ఎన్నికల్లో ఆయన పార్టీ ఏఐడీఎంకేతో పొత్తు పెట్టుకుని మూడో సారి ముఖ్యమంత్రి అయ్యారు.  2016 ఎన్నికల నాటికి ఏఐడీఎంకేతో తెగ తెంపులు  చేసుకుని ఒంటరిగా పోటీ చేసిన ఏఐఎన్ఆర్‌సి ప్రతిపక్షానికి పరిమితమైంది. 2021 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో చేరిన రంగస్వామి, నాలుగోసారి సీఎం అయ్యారు. 2026 ఎన్నికల్లో అదే భాగస్వామ్యంతో అయిదో సారి సీఎం పీఠం అధిరోహించడానికి సిద్దమయ్యారు. రంగస్వామి పూర్తి పేరు నటేశన్ కృష్ణస్వామి గౌండర్ రంగస్వామి.1950 ఆగస్టు 4న పుదుచ్చేరిలో నటేశన్ కృష్ణస్వామి మరియు పంచాలి దంపతులకు జన్మించారు . 

లా పట్టభద్రుడైన రంగస్వామి ముందు ప్రస్తుతం పెద్ద సవాలే ఉంది. ప్రజలు తనపై ఉంచిన అపార నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని రంగస్వామి కూడా పట్టుదలతో ఉన్నారు. అదే కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించడం.   కేవ‌లం 30 అసెంబ్లీ స్థానాలున్న ఆ కేంద్ర పాలిత ప్రాంతంలో ఏం చేయాల‌న్నా.. కేంద్రం నుంచి అనుమ‌తి త‌ప్ప‌ని స‌రి. దాంతో పుదుచ్చేరి వాసులు కొన్ని ద‌శాబ్దాలుగా పెట్టుకున్న ఆకాంక్ష‌లు పెద్ద‌గా నెర‌వేర‌డం లేదు.  75 ఏళ్ల‌కు పైగా వ‌య‌సున్న రంగ‌స్వామి, నిరాబరంగా జీవిస్తారు. అన్ని సార్లు సీఎం అయినా ఆయన కారు ఎక్కడానికి పెద్దగా ఇష్టపడరు. టూ వీలర్ తానే స్వయంగా నడుపుతూ ప్రజల్లో తిరుగుతుంటారు. అందుకే ఆయన బుల్లెట్ రంగస్వామిగా ప్రజలకు ప్రీతిపాత్రులయ్యారు.  అయితే కీల‌క‌మైన రాష్ట్ర హోదా సాధించే విష‌యంలో రంగ‌స్వామి వెనుక‌బ‌డుతున్నారనే విమర్శలున్నాయి. 

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సీఎంగా దాన్ని ఆయన సాధించలేకపోయారు. గత అయిదేళ్లుగా ఎన్టీఏ భాగస్వామిగా ఉన్న ఆ హోదా తీసుకురాలేక పోయారు. ఆయనపై అదొక్కటే అసంతృప్తి. అయితే.. ఆయ‌న ప్ర‌ధాని మోడీని గ‌త ఐదేళ్ల కాలంలో 35 సార్లు క‌లిసి.. విజ్ఞ‌ప్తి చేయ‌డం.. తాజా ఎన్నికల్లో సానుకూల‌త‌ పెంచింది. ఆ క్రమంలో తాము అధికారంలోకి వ‌స్తే.. ప్ర‌త్యేక రాష్ట్ర హోదా కల్పిస్తామ‌ని ఎన్టీఏ పెద్దలు ప్రచారంలో హామీ ఇచ్చారు. రంగ స్వామి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లి.. తనపై న‌మ్మ‌కం ఉంటే.. ఈ సారికి మీ ఓటు తనకే వేయాలనిచ ఈ ద‌ఫా హోదా తీసుకువ‌స్తానని శ‌ప‌థం కూడా చేశారు. అదే ఇప్పుడు రంగస్వామి పార్టీకి కలిసి వచ్చింది.  ఇక ఆ పెద్దాయన పుదుచ్చేరికి రాష్ట్రహోదా కల్పించడమే మిగిలి ఉంది