వరంగల్ లో చక్రం తిప్పుతున్న పొన్నాల కోడలు?
Published on: Thu Apr 26, 2012 12:20PM
రాష్ట్ర ఐటిశాఖా మంత్రి పొన్నాల లక్ష్మయ్య కోడలు పొన్నాల వైశాలి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. మంత్రిగారితో ఏ పనైనా జరగాలంటే ముందుగా వైశాలిని ప్రసన్నం చేసుకుంటే చాలుననే స్థాయివరకూ ఆమె ఎదిగారు. ప్రస్తుతం ఆమె మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె ఇప్పుడు డిసిసి అధ్యక్షపదవిపై కన్నేసినట్లు తెలిసింది. ఆమె ప్రయత్నాలకు మామ పొన్నాల లక్ష్మయ్య ఆశీస్సులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక మహిళకు డిసిసి అధ్యక్షపదవి అప్పగిస్తే తొలిసారిగా మహిళకు అవకాశమిచ్చిన ఘనత దక్కుతుందని పొన్నాల లక్ష్మయ్య అంటున్నట్లు తెలుస్తోంది.
ఆమెను డిసిసి అధ్యక్షురాలిగా నియమిస్తే ఈ జిల్లాలో పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందని, ఆమెకు ఎవరితోనూ ఏటువంటి విభేదాలు లేవని లక్ష్మయ్య అంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పదవిని ఆశిస్తున్న దుగ్యాల శ్రీనివాసరావు, దొంతి మాధవరెడ్డి, రాజవర్తనరెడ్డి, వైశాలి ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. పొన్నాల లక్ష్మయ్య ఏనాడూ పార్టీ అభివృద్ధికి కృషి చేసింది లేదని, ఇప్పుడు ఆయన తన కోడలిని రంగంలోకి దింపి పార్టీని మరింత బలహేనపరిచేందుకు ప్రయత్నిస్తునారని వారు అంటున్నారు. తెలంగాణలో పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ వివాదాలకు తావులేకుండా డిసిసి అధ్యక్షుడిని ఎంపిక చేయాలని అధిస్థానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.


