ధర్మాన ఆపరేషన్ ఆకర్ష్
Published on: Mon Apr 23, 2012 2:05PM
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట అసెంబ్లీ ఉప ఎన్నికలను జిల్లా మంత్రి ధర్మానప్రసాదరావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ధర్మాన తమ్ముడు కృష్ణదాసు పోటీ చేస్తుండగా, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున అన్నగారైన ధర్మాన రాందాసు పోటీ చేస్తున్నారు. పోటీ చేస్తున్నది అన్నగారైనా ఆయనను ఓడించటం తన కర్తవ్యమ్ అనే భావనతో ధర్మాన ప్రసాదరావు ఆపరేషన్ ఆకర్ష్ పేరిట తన వ్యూహ్యాన్ని అమలు చేస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగా నియోజకవర్గంలోని అర్హులకు వందలాది దీపం కనెక్షన్లు ఇప్పిస్తున్నారు. మహిళలకు విరివిగా రుణాలు మంజూరు చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి సుమారు 20 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు.
ఈ నిధులతో ధర్మాన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్ట్టారు. మరోవైపు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేస్తున్న నాయకులకు గాలెం వేస్తున్నారు. టిడిపి ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చేవారం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుడు చిరంజీవి పర్యటించే అవకాశం ఉండి. వచ్చే నెల మొదటివారంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారానికి రానున్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, పార్థసారథి, విజయవాడ ఎంపి లగడపాటి ఇప్పటికే ఈ నియోజకవర్గంలో పర్యటించారు. ఉప ఎన్నికకు సంబంధించి తప్ప మరే విషయాలు తనకు చెప్పవద్దని మంత్రి ధర్మాన తన అనుచరులతో చెబుతున్నారంటే ఆయన ఈ ఎన్నికలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.


