శ్రీదేవి మరణంపైనా కాంగ్రెస్ మార్క్

ప్రముఖ నటి శ్రీదేవి మృతితో దేశం విషాదంలో మునిగిపోయింది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఆమె మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. సామాజిక మాధ్యమాల్లో తమ స్పందన తెలియజేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్‌పై వివాదం రేగింది. శ్రీదేవి మరణవార్త పట్ల చింతిస్తున్నామని.. ఆమె గొప్ప నటి అని ఏఐసీసీ తన అధికారిక ట్విట్టర్‌లో పేర్కొంది. అంత వరకు బాగానే ఉంది కానీ.. యూపీఏ హయాంలోనే.. ఆమెకు పద్మశ్రీ దక్కిందని ట్వీట్ చేయడంపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. శ్రీదేవి మరణాన్ని కూడా కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తోందంటూ నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. చేసిన పొరపాటును తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ ట్వీట్‌లో తమ హయాంలో పద్మశ్రీ అవార్డు దక్కిందన్న విషయాన్ని తొలగించింది.