లక్ష్మీపార్వతిపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఆవిడేం తల్లి అసలు?

 

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఎన్టీఆర్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా అనేక సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ని.. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అని రెండు భాగాలుగా విడుదల చేసారు. దీనికి పోటీగా రామ్ గోపాల్ వర్మ.. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. విడుదలైన సాంగ్స్, ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాలో చంద్రబాబుని నెగటివ్ గా, లక్ష్మీపార్వతిని పాజిటివ్ గా చూపించబోతున్నారని అర్ధమవుతోంది. అయితే వర్మకి పోటీగా.. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 'లక్ష్మీస్ వీరగ్రంధం' పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో లక్ష్మీపార్వతిలోని నెగటివ్ యాంగిల్ చూపించబోతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో లక్ష్మీపార్వతిగా శ్రీరెడ్డి నటించబోతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడిన శ్రీరెడ్డి.. లక్ష్మీపార్వతి గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు.

'లక్ష్మీస్ వీరగ్రంధం' సినిమాలో లక్ష్మీపార్వతి పాత్రని ఎలా చూపించబోతున్నారని ఆమెని ప్రశ్నించగా.. ప్రతి మనిషిలో మంచి, చెడూ రెండూ ఉంటాయని, దాన్ని అందరూ యాక్సెప్ట్ చేయాలని అన్నారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో లక్ష్మీపార్వతి రాజకీయ లబ్ది కోసం ఆమెని పాజిటివ్ యాంగిల్ లో చూపిస్తున్నారని, కానీ కేతిరెడ్డి ఆమెలో నెగెటివ్ షేడ్స్ చూపించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఈ రెండూ తప్పు కాదని, ఎవరేం చెప్పినా.. అసలేం జరిగిందో జనాలకు తెలుసునని.. వాళ్లకు నచ్చితేనే సినిమాలు ఆడతాయని తెలిపారు. ఇక లక్ష్మీపార్వతి గురించి మాట్లాడుతూ.. 'ఎన్టీఆర్ గారు 1923లో పుట్టారు. లక్ష్మీపార్వతి మొదటి భర్త వీరగ్రంధం సుబ్బారావు గారు 1937లో పుట్టారు. తనకంటే పెద్దవాడని కాపురం చేయలేకపోతున్నానని భర్తని, పదహారేళ్ల బిడ్డను వదిలేసింది లక్ష్మీపార్వతి. ఆవిడేం తల్లి అసలు?. వీరగ్రంధం గారి కంటే ఎన్టీఆర్ వయసులో ఇంకా పెద్దవాడని అతడితో లక్ష్మీపార్వతికి ఎలాంటి వ్యత్యాసాలు రాలేదా?' అని ప్రశ్నించారు. 'ఎన్టీఆర్ గారు చివరి రోజుల్లో ఒంటరైపోతే తనే దగ్గరుండి చూసుకున్నానని లక్ష్మీపార్వతి చెప్పేది.. మరి ఈమె వదిలేస్తే తన భర్త, పిల్లాడు ఒంటరి వాళ్లు కాలేదా.?' అని శ్రీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.