TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లంకలో రావణకాష్టం.. ముదిరిన రాజకీయ సంక్షోభం

Published on: Sun Jul 10, 2022 8:46AM

లంకలో రాజకీయ సంక్షోభం ముదిరి పాకాన పడింది. ప్రజలలో అసహనం రావణకాష్టంలా రగులుతోంది.శ్రీలంకను అర్ధికంగా దివాళా స్థితికి తీసుకువచ్చిన అధ్యక్షుడు రాజపక్సే గట్టబాయ రాజీనామా చేయాలంటూ గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు శనివారం పరాకాష్టకు చేరుకున్నాయి.శనివారం కర్ఫ్యూ ఎత్తివేయడంతో లక్షలాది మంది ఆందోళనకారులు దేశం నలుమూలల నుంచీ కొలంబో చేరుకుని అధ్యక్షుడి నివాసాన్నిముట్టడించారు. జనసందోహాన్ని అదుపు చేయడంలో భద్రతా దళాలు ఏం చేయలేక చేతులెత్తేశాయి. ఎలాంటి విధ్వంసం, రక్తపాతం లేదు. అధ్యక్ష నివాసం జనం అధీనంలోకి వెళ్లిపోయింది. అయితే జనం అధ్యక్ష నివాసాన్ని ముట్టడించడానికి ముందే రాజపక్సె గొట్టబాయ పలాయనం చిత్తగించారు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారన్న సమాచారం లేదు. దేశం విడిచి వెళ్లిపోయారని అంటున్నారు.

ఏది ఏమైనా దేశాధ్యక్షుడు ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక  అజ్ణాతంలోకి వెళ్లిపోయారన్నది మాత్రం వాస్తవం.ఆందోళనకారులు శ్రీలంక ప్రధాని నివాసాన్ని దగ్ధం చేశారు. ప్రజాగ్రహానికి శ్రీలంక రాజకీయం వణికిపోయింది. పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలంతా సమావేశమయ్యారు. ప్రధాని విక్రమసింఘే రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వస్తే తాను తక్షణమే రాజీనామా చేస్తానని ఆయన ఆ సమావేశంలో ప్రకటించారు. వారం రోజుల్లో తాత్కాలిక అధ్యక్షుడి ఎన్నిక కోసం పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ ప్రకటించారు. 

అంతకు ముందు జన సముద్రం శ్రీలంక రోడ్లపై కవాతు చేస్తున్నదా అన్నట్లు కొలంబో రోడ్లన్నీ ఇసుక వేస్తే రాలదన్నంతగా ఆందోళన కారులతో నిండిపోయాయి. దేశంలో అన్ని దార్లూ కొలంబోకేనా అన్నట్లు రహదారుల జన ప్రవాహం కొలంబో చేరుకుని అధ్యక్షుడు రాజపక్సె గొట్టబాయ నివాసానికి దారితీసింది. బారికేడ్లను ఛేదించుకొని మరీ గొటబాయ నివాసం వైపు జన ప్రవాహం కదిలింది. ఆస్తులకు ఎలాంటి నష్టం చేయకుండానే అధ్యక్షుడి నివాసం జనం స్వాధీనమైంది.

ఆందోళనకారులు గొటబాయ నివాసంలోని స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొట్టారు.  అందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. అధ్యక్ష భవనంలోని గదులు, కారిడార్లు జనంతో కిక్కిరిసి పోయాయి. ఇంకా వందలాది మంది ఆందోళనకారులు భవనం వెలుపల ఉన్నారు.  రాజపక్సె గొటబాయ రాజీనామా చేసేదాకా తమ ఆందోళనలను ఆపే ప్రసక్తే లేదని ఆందోళనకారులు స్పష్టం చేశారు.