TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కక్ష కట్టిన ఆడబిడ్డ.. రంగంలోకి బ్రదర్ అనిల్!

Published on: Fri May 12, 2023 5:37PM

ఇంటిగుట్టు లంకకి చేటు అన్నట్లు.. ఇంటి గుట్టు పార్టీకి.. అదీ అధికార ఫ్యాన్ పార్టీకి చేటు అన్నట్లుగా ఉందనే ఓ చర్చ అయితే అంధ్రప్రదేశ్ పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది. మాజీ మంత్రి వైయస్ వివేకా హత్య కేసులో ప్రదానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డిలు చేసిన తీవ్ర ఆరోపణలపై వైయస్ ఫ్యామిలీ నుంచి ఒక్కరంటే ఒక్కరు స్పందించిందీ లేదు.. ఖండించిందీ లేదని.. కానీ వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మాత్రం వైయస్ అవినాష్ రెడ్డి అండ్ కో చేసిన ప్రతీ ఆరోపణను అటు ఢిల్లీలో... ఇటు హైదరాబాద్‌లో.. ఎక్కడైనా సరే మీడియా ముందకు వచ్చి.. ఎన్నీ ప్రెస్ మీట్ సింగిల్ హ్యాండ్ అన్నట్లు.. ఏ మాత్రం అదురు బెదురు లేకుండా వైయస్ వివేకాపై వచ్చిన ఆరోపణలను ఖండించడమే కాదు.. తమ చిన్నాన్న ఎలాంటి వ్యక్తి.. ఆయన వ్యక్తిత్వం ఏమిటి... అలాగే కడప జిల్లా ప్రజల్లో ఆయనకు ఉన్న గుడ్ వీల్ ఎలాంటిదో కూడా సోదాహరణగా వివరించింది.. వివరిస్తోంది కూడా. దీంతో వైయస్ షర్మిల వ్యాఖ్యలను తెలుగు ప్రజానికం నమ్మక తప్పని పరిస్థితి నెలకొందనే ఓ చర్చ అయితే సదరు సర్కిల్‌లో కొన... సాగుతోంది. 

మరోవైపు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తన చిన్నన్న వైయస్ వివేకా హత్య చోటు చేసుకొందని.. అందులో సీఎం చంద్రబాబు పాత్ర ఉందని.. దీనిపై సీబీఐతో విచారణ జరిపిస్తేనే కానీ.. ఈ హత్య కేసులో పాత్రదారులు, సూత్రధారులు బయటకు వస్తారంటూ పులివెందుల్లోని వైయస్ వివేకా మృతదేహం సాక్షిగా నాటి ప్రతిపక్షనేత వైయస్ జగన్ డిమాండ్ చేశారని.. ఆ క్రమంలో ఆయన కోర్టులో సైతం ఈ హత్య కేసు సీబీఐ విచారణ చేపట్టాలంటూ పిటిషన్ కూడా దాఖలు చేశారని... ఆ తర్వాత ఎన్నికలు జరగడం.. ఆ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి బంపర్ మెజార్టీ రావడం.. జగన్ ముఖ్యమంత్రి కావడం... నాటి నుంచి సీఎం వైయస్ జగన్ .. నేటి వరకు ఈ వివేకా హత్య కేసులో అనుసరించిన వ్యవహారశైలిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో వాడి వేడిగా నడుస్తోంది.   

ఇంకోవైపు వైయస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ సైతం ప్రస్తుతం రంగంలోకి దిగి.. వైయస్ జగన్‌ను గద్దె దింపేందుకు ఎంత చేయాలో అంత చేసేందుకు తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు.. అందులోభాగంగా వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీకి కొన్ని వర్గాల వారి నుంచి ఓట్లు పడకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికలు సైతం ఆయన సిద్దం చేసి.. వాటిని ఎన్నికల నాటికి స్లిపర్ సెల్స్‌లాగా జనాల్లోకి పంపేందుకు వ్యూహరచన సైతం సిద్దం చేసినట్లు సదరు సర్కిల్‌లో ఓ టాక్ అయితే హల్‌చల్ చేస్తోంది.   

అయితే ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత స్థానం నుంచి వైయస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారంటే.. ఆ అందులో ఆయన తల్లి వైయస్ విజయమ్మ, చెల్లి వైయస్ షర్మిల, బావ బ్రదర్ అనిల్ కుమార్ పాత్ర ఖచ్చితంగా ఉందని.. ఇది ఎవరు కాదనలేని సత్యమని స్పష్టం చేసే వారు ఉన్నారని... అయితే వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిల.. జగనన్న వదిలిన బాణం అంటూ తన పాదయాత్రలో బాణంలాగా దూసుకుపోతే.. ఆమె భర్త బ్రదర్ అనిల్ మాత్రం.. 2019 ఎన్నికల వేళ.. జగన్ గెలుపు కోసం చాలా పకడ్బందీ వ్యూహాంతో ముందుకు వెళ్లారని... దీంతో క్రిస్టియానిటీ ఓటింగ్ అంతా గంపగుత్తగా ఫ్యాన్ పార్టీకి పడడంలో కీలకంగా మారిందని.... ఆ క్రమంలో రాష్ట్రంలోని మొత్తం 24 ఎస్సీ నియోజకవర్గాల్లో 23 జగన్ పార్టీ ఖాతాలోకి వచ్చి పడ్డాయంటే అదంతా బ్రదర్ అనిల్ కుమార్ వ్యూహా రచన అనే వారు సైతం ఫ్యాన్ పార్టీలో ఉన్నారనే టాక్ సైతం వైరల్ అవుతోంది.  

అదీకాక వచ్చే ఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవాలని.. ఆ క్రమంలో  వై నాట్ 175 అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్.. పార్టీ శ్రేణులతో నిర్వహిస్తున్న వివిధ సమీక్షా సమావేశాల్లో మాట్లాడడమే  కాకుండా.. ఆ దిశగా ఆయన ప్రణాళికలు సైతం వేసుకొని.. ముందుకు సాగుతోన్నారని... అయితే ఇప్పటికే వైయస్ జగన్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఓ క్లారిటీ అయితే వచ్చేసిందని.. అలాగే  గత ఎన్నికల వేళ.. వైయస్ జగన్ వెంట నడిచిన వారు.. ఈ ఎన్నికల వేళ నడుస్తారా? అంటే అదీ సందేహమేనని.. ఐ ప్యాక్ తప్ప.. వైయస్ ఫ్యామిలీలోని  వారు సైతం ఆయన వెంటనే నడిచే పరిస్థితులు అయితే లేవనే వ్యాఖ్యలు సైతం వినిపిస్తున్నాయని... మరి జగనన్న వదిలిన బాణం అంటూ నాడు వైయస్ జగన్‌ను అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ఎంత చేయాలో అంత చేసిన వైయస్ షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్.. అదే జగనన్నను గద్దె దింపేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఈ దంపతులు సఫలీకృతులవుతారా? లేదా? అనేది మాత్రం వచ్చే ఎన్నికల ద్వారా సుస్పష్టమవుతోందని చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది.