కొండవీడు రైతుది ఆత్మహత్యే.. దుష్ప్రచారం వద్దు

 

ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్న కొండవీడు వేడుకల సందర్భంగా రైతును పోలీసులే కొట్టి చంపారనే ప్రచారంపై గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్‌బాబు వివరణ ఇచ్చారు. రైతు ప్రాణాలు కాపాడటానికి పోలీసులు వందల మీటర్లు పరుగులు పెట్టి ఆసుపత్రికి తరలిస్తే.. వారే కొట్టి చంపారని విషప్రచారం చేస్తున్నారని, దీనిని సహించబోమని స్పష్టం చేశారు. ఆయన్ని కాపాడటానికి పోలీసులు పడిన కష్టాల వీడియోలు, ఫొటోలున్నాయని వివరించారు. పోలీసులే కొట్టి చంపినట్లు ఏ ఒక్కరైనా చూస్తే వచ్చి చెప్పాలని ఘాటుగా స్పందించారు. రైతు కోటేశ్వరరావుకు 14 ఎకరాల స్థలం ఉందని, అది కొండవీడు వేడుక జరిగే ప్రాంతానికి చాలా దూరంగా ఉందని తెలిపారు. ఇందులో మూడు నుంచి నాలుగెకరాల ఖాళీ స్థలంలో అనుమతులు తీసుకొని పోలీసు కంట్రోల్‌రూం ఏర్పాటుచేశామని అన్నారు. ఈ స్థలానికి దూరంగా బొప్పాయి, కనకాంబరం, మునగ తోటలున్నాయని తెలిపారు. సోమవారం ఉదయం పదింటికి రైతు కోటేశ్వరరావు పురుగుల మందు తాగినట్టు అక్కడ గస్తీ పోలీసులకు సమాచారం అందిందని అన్నారు. ఆయన ప్రాణాలు కాపాడాలనే ఆతృతతో ఓ కానిస్టేబుల్‌.. కోటేశ్వరరావును భుజంపై వేసుకొని దాదాపు 700 మీటర్లు పరుగు తీశారని వివరించారు. పోలీసులంతా అప్రమత్తమై విద్యుత్‌ శాఖకు చెందిన వాహనాన్ని ఏర్పాటుచేసి ఫిరంగిపురంలోని ఆసుపత్రికి తరలించారని తెలిపారు. దురదృష్టవశాత్తు అప్పటికే ఆ రైతు మృతి చెందాడన్నారు.

హెలీప్యాడ్‌కు 700 మీటర్ల వెనక ఎక్కడో దూరంగా రైతు స్థలం ఉందని, హెలీప్యాడ్‌ కోసం రైతు స్థలం తీసుకున్నారని దుష్ప్రచారం చేయడం సరికాదని అన్నారు. సీఎం వచ్చినప్పుడు హెలీప్యాడ్‌ సమీపంలోకి ఎవరూ రావొద్దని పోలీసులు మైక్‌ల ద్వారా హెచ్చరించారే తప్ప ఏ ఒక్కరిపైనా దురుసుగా ప్రవర్తించలేదని అన్నారు. ఈ క్రమంలో కనకాంబంరం తోటలో కొద్ది మొక్కలను తొక్కి ఉండవచ్చని, తోట మొత్తం పాడుజేశారనడం సరికాదని అన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి డీఎస్పీ స్థాయి అధికారితో పారదర్శకంగా దర్యాప్తు చేయిస్తున్నామని ప్రకటించారు. కట్టుకథల వెనుక ఎవరున్నారనేది తేల్చి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.