తెలుగు వన్లో సౌందర్యలహరి
Published on: Mon Sep 22, 2025 4:58PM

తెలుగు వన్ ఆధ్వర్యంలో భక్తివన్ ద్వారా ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి భక్తుల కోసం సరికొత్త రూపంలో అందుబాటులోకి వచ్చింది. వంద సంస్కృత శ్లోకాలను సులభంగా అర్థమయ్యేలా తెలుగులో తాత్పర్యంతో వివరించిన ఈ ప్రత్యేక వీడియోను సోమవారం ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ సీఎస్ మాట్లాడుతూ “సౌందర్యలహరి శ్లోకాలు ఆధ్యాత్మిక తాత్పర్యాన్ని మాత్రమే కాక, మానవ జీవనానికి అందమైన దారిదీపమవుతాయి.
తెలుగు వన్ తీసుకున్న ఈ ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆధ్యాత్మిక వనరుగా నిలుస్తుంది” అన్నారు. కార్యక్రమంలో తెలుగు వన్ ఎండీ కంఠమనేని రవిశంకర్ మాట్లాడుతూ, “ఆది శంకరుల అమూల్య కృతిని కొత్త తరానికి అందించే అవకాశం లభించడం మా అదృష్టం” అన్నారు. భక్తివన్ బృందం రూపొందించిన ఈ వీడియోలో ప్రతి శ్లోకానికి భావార్థం, పఠనం, విశ్లేషణను సమగ్రంగా చేర్చారు. సాంకేతికతతో సంస్కృత సంపదను సమ్మిళితం చేసిన ఈ కృషి, భక్తుల హృదయాలలో భక్తి, జ్ఞానం కలగలిపే వంతెనగా నిలుస్తోంది.


