నా ఆత్మకథ రాస్తా.. అప్పుడు చెప్తా: సోనియా

 

విదేశాంగ శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ నాయకుడు నట్వర్‌సింగ్ తన ఆత్మకథ ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్’లోని కొన్ని అంశాలు బహిర్గతమైన విషయం తెలిసిందే. ఈ పుస్తకంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించిన అనేక విషయాలను, కాంగ్రెస్ పార్టీ తనకు చేసిన ద్రోహాన్ని నట్వర్ సింగ్ పొందుపరిచారు. సోనియాగాంధీ ప్రధానమంత్రి కాకపోవడానికి ఆమె చేసిన ‘త్యాగం’ కారణం కాదని, తన తల్లి ప్రధానమంత్రి అయితే నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ తరహాలోనే హత్యకు గురవుతుందని రాహుల్ గాంధీ భయపడటమేనని ఆ పుస్తకంలో నట్వర్ సింగ్ పేర్కొన్నారు. ఈ విషయం మీద సోనియా గాంధీ స్పందించారు. ఓ ఆంగ్ల టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనియా స్పందిస్తూ ‘‘నేను కూడా నా ఆత్మకథని రాస్తాను. అప్పుడు వాస్తవాలు బయటపడతాయి’’ అని ఆమె వ్యాఖ్యానించారు. మొత్తమ్మీద నట్వర్ సింగ్ ఆత్మకథలోని విషయాలు సోనియాగాంధీకి ఇరిటేషన్ తెప్పించినట్టే వుంది. మొత్తమ్మీద నట్వర్ సింగ్ ఆత్మకథ విడుదలయ్యాక అందులో ఇంకెన్ని సంచలనాలు ఉంటాయో!