TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్ ప్రజలను చూసి గర్వపడుతున్న : సోనమ్ వాంగ్‌చుక్

Published on: Sun Jun 14, 2026 1:24PM

 

భాగ్యనగరంలో ‘బొద్దింకల’ పోరాటం..సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) డిజిటల్ ఉద్యమం ఇప్పుడు తెలంగాణ గడ్డపై ప్రత్యక్ష పోరాటానికి దారితీసింది. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వేదికగా ఆదివారం ఒక భారీ శాంతియుత నిరసన ప్రదర్శన జరిగింది. ఇటీవల దేశ విద్యావ్యవస్థను కుదిపేసిన నీట్  పరీక్ష పేపర్ లీకేజీలు, అలాగే సీబీఎస్ఈకి చెందిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంలో జరిగిన తీవ్రమైన అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చారు. ఈ పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలంటూ నిరసనకారులు గట్టిగా డిమాండ్ చేశారు. దానికి తోడు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ కూడా తమ పదవుల నుంచి తప్పుకోవాలంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు.

ఈ నిరసన ప్రదర్శనలో అత్యంత కీలకమైన మరియు ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే.. ప్రముఖ విద్యా సంస్కర్త, మెగసేసే అవార్డు గ్రహీత, పర్యావరణ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ స్వయంగా భాగ్యనగరానికి విచ్చేసి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. యువత ఆశయాలకు, ప్రజాస్వామ్యయుత పోరాటానికి ఆయన తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. గతంలో తనను తాను ఒక ‘గౌరవ బొద్దింక’గా అభివర్ణించుకున్న వాంగ్‌చుక్, విద్యావ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే యువత ఆవేదనను ప్రభుత్వం అణిచివేయకుండా వినాలని హితవు పలికారు. భావప్రకటనా స్వేచ్ఛను నొక్కిపడితే నేపాల్‌లో ఎలాంటి తిరుగుబాటు వచ్చిందో భారత్‌లో కూడా అలాంటి పరిణామాలే ఎదురవుతాయని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ వేదికగా లీకేజీల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పరీక్షల వ్యవస్థలో పూర్తి జవాబుదారీతనం తేవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ మహాధర్నాకు తెలంగాణ విద్యార్థి లోకం, నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. సీజేపీ అధికార ప్రతినిధి విజేత దహియా, హైదరాబాద్ ఉద్యమ నిర్వాహకుడు రుచిత్ కమల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పాల్గొని తమ ఆవేదనను పంచుకున్నారు. తెలంగాణ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. కేవలం 6 శాతం మంది డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకే ప్రస్తుతం ఉద్యోగ నైపుణ్యాలు (స్కిల్స్) ఉన్నాయని, మిగిలిన 94 శాతం విద్యార్థుల భవిష్యత్తును ఈ విద్యావ్యవస్థ అంధకారంలోకి నెట్టేస్తోందని తెలంగాణ మాజీ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా జరుగుతున్న పేపర్ లీకేజీలకు క్యాబినెట్ లంచగొండితనమే కారణమని, బాధ్యులైన వారిని కేవలం రాజీనామా చేయించడమే కాకుండా జైలుకు పంపాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నిరసన కార్యక్రమానికి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (AIYF) వంటి విద్యార్థి, యువజన సంఘాలతో పాటు స్థానిక డప్పు కళాకారులు, ప్రజా గాయకులు మద్దతుగా నిలిచారు. మరోవైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) పరీక్షల్లో జరుగుతున్న జాప్యం, భారీగా పెంచిన అప్లికేషన్ ఫీజులపై కూడా స్థానిక అభ్యర్థులు తమ గళాన్ని విప్పారు. కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలని, ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలను పెంచాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో పుట్టి, ఢిల్లీలోని జంతర్ మంతర్, పుణే, లక్నోల మీదుగా ఇప్పుడు హైదరాబాద్ ఇందిరాపార్కును తాకిన ఈ ‘కాక్రోచ్’ విప్లవం.. దేశంలో విద్యా సంస్కరణలు వచ్చే వరకు, పరీక్షల పత్రాల లీకేజీలకు అడ్డుకట్ట పడే వరకు శాంతియుతంగా కొనసాగుతుందని ఆందోళనకారులు స్పష్టం చేశారు.