TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆ హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తా.. కేంద్రాకి సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం..!

Published on: Wed Jul 22, 2026 9:21PM

 

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఆందోళనలు చేపడుతున్న విద్యార్థులు, యువతకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ కేంద్ర ప్రభుత్వానికి కీలక లేఖ రాశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లకు తన ప్రతిపాదనలను వివరిస్తూ లేఖ పంపారు.

ఉద్యమంలో పాల్గొన్న యువత, విద్యార్థులపై ఎలాంటి చట్టపరమైన కేసులు, పోలీసు వేధింపులు ఉండవని ప్రభుత్వం అధికారికంగా హామీ ఇస్తే వెంటనే తన దీక్షను విరమిస్తానని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. అలాగే తమ ఆందోళనలను తాత్కాలికంగా పక్కనపెట్టి ప్రభుత్వంతో శాంతియుత చర్చలకు రావాలని నిరసనకారులను కూడా కోరతానని ఆయన పేర్కొన్నారు.

ఆసుపత్రికి వచ్చి తన ఆరోగ్యాన్ని పరామర్శించి దీక్ష ఉపసంహరించుకోవాలని కోరిన కేంద్ర మంత్రులకు లేఖలో ఆయన ధన్యవాదాలు తెలిపారు. పేపర్ లీక్ కారణంగా ఆవేదనతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించడం, విద్యాశాఖ మంత్రి రాజీనామా అంశం పరిశీలన, పార్లమెంటులో దీనిపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడాన్ని ఆయన గుర్తుచేశారు.

తన పోరాటం విద్యార్థుల భవిష్యత్తు కోసమేనని, ఇప్పటికీ 65 మంది వివిధ పార్టీల ఎంపీలు తనకు లేఖ రాసి దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారని తెలిపారు. తాను కూడా జీవించి విద్యార్థుల కోసం మరింత సేవ చేయాలనుకుంటున్నానని, అయితే ఆందోళనలో పాల్గొన్న యువత భవిష్యత్తును పణంగా పెట్టి వెనక్కి తగ్గలేనని స్పష్టం చేశారు.

గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, లీకేజీ ఆరోపణలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలపై పోలీసులు బలప్రయోగం చేయడం, లాఠీఛార్జ్ నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ వ్యవహారంలో ప్రతిపక్షాలు సైతం కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. గత పదేళ్లలో అనేక పోటీ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని ఆరోపిస్తూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ సహా ఇతర ప్రధాన పక్షాలు పార్లమెంటుతో పాటు వీధుల్లోనూ ఆందోళనలు తీవ్రతరం చేశాయి.

ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రతిపాదించిన నిబంధనలకు కేంద్ర ప్రభుత్వం ఏ రీతిలో స్పందిస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం సానుకూల ప్రకటన చేస్తే ఈ వివాదానికి త్వరలోనే పరిష్కారం లభించే అవకాశముంది.

Sonam Wangchuk Hunger Strike, NEET Paper Leak Controversy, Union Ministers JP Nadda Jitendra Singh, Student Protests NEET UG, Sonam Wangchuk Letter to Central Government