ఇంత కామెడీ తట్టుకోలేరు.. మోకాలికి బోడిగుండుకు లింకు పెట్టకండి..
posted on Dec 19, 2017 4:57PM
గుజరాత్ ఎలక్షన్స్ లో గెలిచినా... మోడీ, అమిత్ షా లాంటి పెద్ద వాళ్లే కాస్త ఆలోచించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే.. ఈ ఎన్నికల్లో బీజేపీకి గెలుపు అంత ఈజీగా రాలేదన్న సత్యం వాళ్లకు తెలుసు కాబట్టి. చాలా, చాలా కష్టపడి.. గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇవన్నీ మరిచిపోయి.. గుజరాత్ ఫలితాలను బట్టి ఏపీలో బీజేపీ గురించి గొప్పలు చెప్పడం చూస్తుంటే కామెడీగా అనిపిస్తోంది. ఇంతకీ అంత కామెడీ చేస్తుంది ఎవరనుకుంటున్నారా..? ఇంకెవరూ.. ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు. అయినదానికి, కాని దానికి మిత్రపక్షం అని కూడా చూడకుండా.. ఎప్పుడు సందు దొరుకుతుందా.. ఎప్పుడు విమర్శలు చేద్దామా అని చూసే సోము వీర్రాజు.. గుజరాత్ ఫలితాల్లో బీజేపీ గెలుపుపై మాట్లాడుతూ.. చంద్రబాబుపై తనకున్న అక్కసును మరోసారి వెళ్లగక్కారు.
ఏదో చచ్చీ చెడీ గుజరాత్ లో గెలిస్తే...మోకాలికి బోడిగుండుకు లింకు పెట్టినట్టు.. ఇక్కడ బీజేపీతో లింక్ పెట్టారు రాజు గారు. అంతేకాదు మాంచి కామెడీ డైలాగ్స్ కూడా వేశారు. ఏపీలో బలపడే శక్తి బీజేపీకి ఉందని, ఏపీలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు ప్రత్యేక హోదాను తెరపైకి తెస్తున్నారని అన్నారు. అక్కడితో ఆగకుండా.. తెలుగుదేశం పార్టీకి ధైర్యం ఉంటే బీజేపీతో పొత్తు వద్దని చెప్పాలని డైలాగ్స్ వేశారు. పాపం రాజుగారికి తెలియని విషయం ఏంటంటే... టీడీపీ లేకపోతే బీజేపీ ని ప్రజలు పట్టించుకోరని. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే.. కనీసం ఆ నాలుగు సీట్లైనా వచ్చాయి. లేకపోతే కాంగ్రెస్ కు, బీజేపీకి పెద్ద తేడా ఏం ఉండేది కాదు. ఇక ఇటీవల జరిగిన కాకినాడ కార్పొరేషన్లో బీజేపీకి 9 సీట్లు ఇస్తే గెలిచింది 3 సీట్లు మాత్రమే. అక్కడ కూడా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఘోరంగా ఓడిపోయాడు. అది కూడా వీర్రాజు సొంత జిల్లాలో. కనీసం తన జిల్లాలోనే తమ నేతను గెలిపించుకోలేక పోయిన రాజుగారు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కామోడీ కాకపోతే ఇంకేంటి.
ఇప్పటికే ఏపీకి కేంద్ర ప్రభుత్వం, మోడీ చేస్తోన్న అన్యాయంతో ఏపీ ప్రజలు మోడీ అన్నా, బీజేపీ అన్నా రగిలిపోతున్నారు. ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేషస్, ఇలా ఒకటికాదు రెండు కాదు పలు అంశాల విషయంలో బీజేపీపై ఏపీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ చేసినా బాబు గారు చూస్తూ ఊరుకున్నా.. రాజు గారు మాత్రం రెచ్చిపోతున్నారు. మరి ఆయన ఇలాగే రెచ్చిపోతే బీజేపీకి తప్పక నష్టం జరగకమానదు. ఏపీలో బీజేపీ నాయకుడు అనేవాడు ఎవరైనా జనాల్లోకి వెళితే వాళ్లు జనాగ్రహానికి ఎలా గురవ్వాల్సి ఉంటుందో ? త్వరలోనే రాజుగారికి అర్ధమయ్యే టైం వస్తుంది. మొత్తానికి ఏపీ బీజేపీలో మంచి కామెడీ టైమింగ్ ఉన్న లీడర్ దొరికాడు.