వారెవ్వా ఏమి ట్యాబ్లెట్

 

ట్యాబ్లెట్ ఎంత తేలిగ్గా వుంటే దాన్ని ఉపయోగించే వాళ్ళకి అంత సౌకర్యంగా వుంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన అనేక కంపెనీలు తాము ఉత్పత్తి చేసే ట్యాబ్లెట్ల బరువును క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఇలాంటి విషయాల్లో ముందుండే డెల్ సంస్థ తాజాగా అత్యంత పల్చగా వుండే ట్యాబ్లెట్‌ని తయారు చేసింది. వెన్యూ 8 పేరుతో రూపొందించిన ఈ టాబ్లెట్ ఈమధ్యే మార్కెట్లోకి కూడా విడుదలైంది. ప్రస్తుతం అమెరికాలో దొరుకుతోంది. తెలిసినవారి చేత తెప్పించుకోవాలంటే దాదాపు పాతికవేల రూపాయల ధరకు లభిస్తుంది. ఇంటెల్ సహకారంతో నిర్మించిన ఈ గాడ్జెట్‌లో ఏకంగా 2.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. డెస్క్‌టాప్ పీసీ సామర్థ్యానికి సమీపంలో ఇది ఉంటుంది. దీంతోపాటు పవర్ వీఆర్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్, రెండు గిగాబైట్ల ర్యామ్ ఉండటం వల్ల మల్టీటాస్కింగ్ సులువు అవుతుంది. గ్రాఫిక్స్ మోతాదు ఎక్కువగా ఉండే గేమ్స్‌ను ఈ ట్యాబ్లెట్లో హాయిగా అడుకోవచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే ఎనిమిది మెగాపిక్సెళ్ల కెమెరా నిక్షిప్తమై వుంది. డెల్ వెన్యూ 8లో 16 జీబీల బిల్ట్ ఇన్ స్టోరేజీ ఉంటుంది. మైక్రోఎస్‌డీకార్డు ద్వారా దీన్ని మనకు కావలసినంత స్థాయికి పెంచుకోవచ్చు కూడా. స్క్రీన్‌సైజు 8.4 అంగుళాలు కాగా, రెజల్యూషన్ 2560 / 1480 వరకూ ఉంటుంది. దీనిలో లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కిట్‌క్యాట్‌ను ఉపయోగించారు. ఇంకేం.. అమెరికాలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా.. వెంటనే తెప్పించుకోండి.. ఇండియాకి ఇది ఎప్పటికి వస్తుందో ఇంకా స్పష్టంగా తెలియదుమరి.