TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కోడికత్తి జగన్నాటకానికి ఆరేళ్లు

Published on: Fri Oct 25, 2024 11:48AM

2019 ఎన్నికలను జీవన్మరణ సమస్యగా తీసుకున్న జగన్ ఆ ఎన్నికలలో విజయం కోసం రకరకాల వ్యూహాలు పన్నారు. ఇష్టారీతిగా హామీలు గుప్పించి ప్రజలను మభ్యపెట్టారు. అలాగే కోడికత్తిదాడి, సొంతబాబాయ్ హత్య ఘటనలను తనకు సానుభూతి వచ్చేలా మలచుకున్నారు. ఎన్నికల పబ్బం గడిచి, అధికార పగ్గాలు అందుకోగానే  కొడికత్తి దాడి కేసు, వివేకా హత్య కేసుల దర్యాప్తునకు ఇసుమంతైనా సహకరించలేదు సరికదా, ఆ కేసుల దర్యాప్తునకు అడుగడుగునా అడ్డుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహనరెడ్డిపై విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో  జరిగిందని చెప్పబడుతున్న కోడికత్తి దాడికి ఆరేళ్లు పూర్తయ్యింది.

 2018లో విశాఖ‌ప‌ట్నంలో జ‌గ‌న్‌పై కోడి క‌త్తితో దాడికి పాల్పడ్డాడంటే జనుపల్లె శ్రీను అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. జగన్ మాత్రం తనపై దాడి వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపిస్తూ, రాష్ట్ర పోలీసుల విచారణపై నమ్మకం లేదని పట్టుబట్టి మరీ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తునకు డిమాండ్ చేసి సాధించుకున్నారు. సరే  ఎన్ఐఏ దర్యాప్తు చేసి జగన్ పై కోడికత్తి దాడి కేసు వెనుక ఎటువంటి కుట్రకోణం లేదని తేల్చేసింది. ఈ కేసులోదాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొం టున్న జనుపల్లె శ్రీను బెయిలుకు కూడా నోచుకోకుండా  దాదాపు ఐదేళ్ల పాటు జైల్లో మగ్గిపోయాడు. 

2019 ఎన్నికలకు ముందు జరిగిన ఈ సంఘటన ద్వారా వచ్చిన సానుభూతి ఆ ఎన్నికలలో జగన్ పార్టీ ఘన విజయానికి కారణాల్లో ఒకటి అయ్యింది. అలాగే అప్పట్లో జగన్ పై సానుభూతి వెల్లువెత్తడానికి మరో సంఘటన కూడా కారణమైంది.  ఎన్ఐఏ ఈ కేసులో ఎటువంటి కుట్ర కోణం లేదని తేల్చేసిన తరువాత కూడా జగన్ కోర్టుకు హాజరై దాడి కేసులో బాధితుడిగా వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధపడలేదు సరికదా.. ఎన్ఐఏ విచారణనే తప్పుపడుతూ లోతైన దర్యాప్తు పరపాలని కోరుతూ  ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖ లు చేశారు. 

 ఇక్కడ ఒక విషయాన్నిచెప్పుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు జగన్ సొంత బాబాయ్, మాజీ మంత్రి, మాజీ ఎంపీ తన సొంత ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. ఆయన ఒంటిపై గాయాలకు కుట్లు వేసి బ్యాండేజీలు కట్టి అది హత్య కాదు గుండెపోటు అని నమ్మించడానికి జగన్ విఫలయత్నం చేశారు.  ఆ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ గత నాలుగేళ్లుగా కనీసం అరెస్టు కాకుండా హాయిగా తిరుగుతున్నారు.  అరెస్టు చేస్తాం అని కేంద్ర దర్యాప్తు సంస్థ కోర్టుకు చెప్పింది. అయినా ఆయ నకు ముందస్తు బెయిలు వచ్చింది.  కానీ హత్యాయత్నం కేసులో అరెస్టైన జనుపల్లె శ్రీనుకు మాత్రం ఐదేళ్ల పాటు బెయిలు దొరకలేదు. జనుపల్లె శ్రీనుకు బెయిలు రావాలంటే ఆ కేసులో బాధితుడిగా ఉన్న జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి. జగన్ ఆ పని చేయలేదు.  అప్పట్లో అంటే కోడికత్తితో జగన్ పై విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన దాడి వెనుక అప్పటి అధికార పార్టీ తెలుగుదేశం కుట్ర ఉందంటూ అప్పట్లో ఆరోపణలు చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో దాడి జరిగిందన్న సాకుతో ఎన్ఐఏ దర్యాప్తును సాధించుకున్నారు.  కానీ ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా తనపై జరిగిన దాడి కుట్రదారులకు శిక్ష పడాలని కేసు విచారణ వేగవంతం కావాలని కోరలేదు. పైపెచ్చు కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వకుండా కేసు విచారణను ఉద్దేశపూర్వకంగా నత్తనడకన సాగేలా చేశారు.  ఈకేసులో బెయిలుకు కూడా నోచుకోకుండా ఐదేళ్ల పాటు జైల్లో మగ్గిపోయిన జనుపల్లె శ్రీనుకు ఎట్టకేలకు కండీషన్డ్ బెయిలు లభించింది అది వేరే సంగతి. అయితే జగన్ తీరు కారణంగా ఇప్పటికే కేసు విచారణ పూర్తి కాలేదు.